మెల్బోర్న్: వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ నుంచి సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ప్రతి ఏడాది క్రేజ్ పెరుగుతోంది. ఈ క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్మనీని నిర్వాహకులు ఈ సంవత్సరం భారీ స్థాయిలో పెంచారు. గతేడాది పోల్చుకుంటే 13.6 శాతానికి పెంచుతూ టోర్నీ నిర్వాహకులు మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొత్తం ప్రైజ్మనీ రూ.350 కోట్లకు చేరుకుంది.
దక్షిణాఫ్రికాతో టెస్టు.. అరుదైన రికార్డుకు చేరువలో అండర్సన్!!
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు నగదు బాహుమతి రూపంలో రూ.20 కోట్లు దక్కనుంది. ఇక తొలి రౌండ్లో నిష్క్రమించే వారికి రూ.44 లక్షలు, రెండో రౌండ్లో నిష్క్రమించే వారికి రూ.63 లక్షలు దక్కనుంది. టోర్నీ డైరెక్టర్ క్రేగ్ టిలే మాట్లాడుతూ... 'ప్రతి ఏడాది లాగే ఈసారి ప్రైజ్మనీ పెంచాం. రౌండ్ రౌండ్కు నగదు మొత్తం పెరుగుతూపోతుంది. దీని ద్వారా చాలా మంది ఆటగాళ్లకు మరింత ఆదాయం సమకూరుతుంది' అని అన్నాడు.
గతేడాది కంటే 13.6 శాతం పెంచడంతో ప్రైజ్మనీ రూ.350 కోట్లకు చేరుకుంది. మిగతా గ్రాండ్స్లామ్ టోర్నీలతో పోల్చుకుంటే గత ఐదేళ్ల కాలంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్మనీ 61.4 శాతం పెరిగింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడే ప్రతి వారికి భారీగా నగదు దక్కుతుంది. ఇక విజేతలకు కాసుల వర్షం కురవనుంది. జనవరి 20న మెల్బోర్న్ పార్కులో ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభం కానుంది.
ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్తో పాటు టెన్నిస్ ముగింపు సీజన్ టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ను గెలిచిన ఆ్రస్టేలియా భామ యాష్లే బార్టీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నయోమి ఒసాకా, సిమోనా హలెప్, బియాంక ఆండ్రెస్కూ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు పురుషుల విభాగంలో టాప్ ఆటగాళ్లు ఫెడరర్, నాదల్, జకోవిచ్ టైటిల్ రేసులో ఉన్నారు.