
హైదరాబాద్: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ పోరుకు మెల్బోర్న్ పార్క్లో రంగం సిద్ధమైంది. ఫైనల్లో ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా(చెక్ రిపబ్లిక్), నాలుగో సీడ్ నవోమి ఒసాకా(జపాన్) అమీతుమీ తేల్చుకోనున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో వీరిద్దరూ తొలిసారి ఫైనల్కు చేరుకున్నారు.
ఫలితంగా కొత్త ఏడాదిలో టైటిల్ నెగ్గాలని ఇద్దరూ తహతహలాడుతున్నారు. తొలి సెమీఫైనల్లో క్విటోవా 7-6(7/2), 6-0 తేడాతో అన్ సీడెడ్ క్రీడాకారిణి డానియెల్లీ కొలిన్స్(అమెరికా)పై విజయం సాధించగా... రెండో సెమీఫైనల్లో జపాన్ క్రీడాకారిణి ఒసాకా 6-2, 4-6, 6-4 తేడాతో కరోలినా ప్లిస్కోవా(చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించింది.
దీంతో వీరిద్దరూ శనివారం జరిగే ఫైనల్ సమరంలో తలపడనున్నారు. క్విటోవా రెండు సార్లు వింబుల్డన్ టైటిల్ను గెలిచారు. 2011, 2014ల్లో క్విటోవా వింబుల్డన్ సింగిల్స్ విజేతగా నిలిచారు. మరోవైపు గతేడాది జరిగిన యుఎస్ ఓపెన్లో ఒసాకా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
తుది పోరులో సెరెనా విలియమ్సన్ను ఓడించి యూఎస్ గ్రాండ్ స్లామ్ను గెలుచుకుంది. ఇదే ఆమెకు తొలి సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్. వీరిద్దరిలో నెగ్గిన వారికి WTA ఉమెన్స్ సింగిల్స్ టాప్ ర్యాంక్ సొంతమవుతుంది. ప్రస్తుతం రొమేనియాకు చెందిన సిమోనా హలెప్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. దీంతో ఆస్ట్రేలియా ఓపెన్ను వీరిద్దరిలో ఎవరు గెలిచినా సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు.