మెల్బోర్న్: కెరీర్లో చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. ఆస్ట్రేలియా ఓపెన్ 2023 టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లింది. భారత స్టార్ రోహన్ బోపన్నతో జతకట్టిన సానియా మీర్జా బుధవారం జరిగిన సెమీఫైనల్లో మూడో సీడ్ నీల్ సుపాస్కి(గ్రేట్ బ్రిటన్), డిసిరే క్రాజెక్(అమెరికా) ధ్వయాన్ని ఓడించింది. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్లో సానియా-బోపన్న జోడీ 7-6, 6-7, 10-6 తేడాతో నీల్-క్రాజెక్ ద్వయాన్ని మట్టికరిపించింది.
In a fitting farewell, @MirzaSania's last dance will take place on the grandest stage!
— #AusOpen (@AustralianOpen) January 25, 2023
She and @rohanbopanna 🇮🇳 have qualified for the Mixed Doubles Final!@wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/qHGNOvWMoC
క్వార్టర్స్లో ప్రత్యర్థి జోడీ ఒస్టాపెంకో (లాత్వియా)-వెగా హెర్నాండెజ్ (స్పెయిన్) వాకోవర్ ఇవ్వడంతో బరిలో దిగకుండానే సానియా ద్వయం సెమీస్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సెమీస్లో అదరగొట్టిన సానియా-బోపన్న జోడీ ఫైనల్కు దూసుకెళ్లింది. బోపన్న సాయంతో ఫైనల్లోనూ విజయం సాధించి కెరీర్కు సానియా మీర్జా ఘన వీడ్కోలు పలకాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
ఫిబ్రవరిలో దుబాయ్ వేదికగా జరిగే డబ్ల్యూటీఏ 1000 టోర్నీతో టెన్నిస్కు వీడ్కోలు పలుకుతానని 36 ఏళ్ల సానియా మీర్జా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభానికి ముందు కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి గురైంది. 30 ఏళ్ల క్రితం ఆరేళ్ల వయసులో నా టెన్నిస్ కల ఆరంభమైంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఏదో ఒకరోజు గ్రాండ్స్లామ్ టోర్నీలో ఆడాలని అనుకునేదాన్ని. ఆడటమే కాదు టైటిళ్లు కూడా సాధించా. 2005లో నా ప్రయాణం ఆస్ట్రేలియన్ ఓపెన్తోనే మొదలైంది. ఇప్పుడు అదే వేదికలో నా చివరి గ్రాండ్స్లామ్ ఆడబోతున్నా. ఆ తర్వాత వచ్చే నెలలో దుబాయ్ టోర్నీతో రాకెట్ వదిలేస్తా'' అని సానియా తెలిపింది.
కెరీర్కు ఇదే ఆఖరి సీజన్ అని గతేడాదే చెప్పిన సానియా మీర్జా మనసు మార్చుకుని ఈ సీజన్లోనూ ఆడుతోంది. ఆస్ట్రేలియన్ ఓపెన్లో 2009లో మిక్స్డ్ డబుల్స్, 2014లో డబుల్స్ టైటిల్స్ను ఈ భారత స్టార్ గెలుచుకుంది. 2005లో హైదరాబాద్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన సానియా.. అదే ఏడాది యుఎస్ ఓపెన్లో ప్రిక్వార్టర్స్ చేరి సంచలనం సృష్టించింది. 2007లో కెరీర్లో అత్యుత్తమంగా 27వ ర్యాంకు సాధించిన ఆమె ఆ తర్వాత గాయాల కారణంగా డబుల్స్పైనే దృష్టి సారించింది.
2015లో సానియా డబుల్స్ కెరీర్ ఉన్నత శిఖరాలకు చేరుకుంది. స్విట్జర్లాండ్ తార మార్టినా హింగిస్ జతగా అప్రతిహత విజయాలు సాధించిన మీర్జా.. వింబుల్డన్, యుఎస్ ఓపెన్లో టైటిల్స్ గెలుచుకుంది. అదే ఏడాది ఆమె మహిళల డబుల్స్లో ప్రపంచ నంబర్వన్ ర్యాంకు కూడా సొంతం చేసుకుంది. కెరీర్ మొత్తం మీద 3 డబుల్స్, 3 మిక్స్డ్ డబుల్స్తో మొత్తం 6 గ్రాండ్స్లామ్ టైటిళ్లు సాధించింది.