దుబాయ్: భారత మహిళల టెన్నిస్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫెడ్ కప్ మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో తొలిసారి భారత జట్టు వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది. శనివారం ముగిసిన ఆసియా ఓసియానియా గ్రూప్-1 టోర్నీలో భారత జట్టు రెండో స్థానంలో నిలిచి ఈ ఘనత అందుకుంది. చైనా టాప్ ర్యాంక్లో నిలిచి భారత్తో కలిసి ప్లే ఆఫ్ అర్హత సాధించింది.
శనివారం ఇండోనేసియాతో జరిగిన మ్యాచ్లో భారత్ 2-1తో గెలిచింది. తొలి మ్యాచ్లో రుతుజా 3-6, 6-0, 3-6తో ప్రిస్కా చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్లో అంకిత రైనా 6-3, 6-3తో అల్దీలా సుత్జియాదిపై నెగ్గి స్కోరును 1-1తో సమం చేసింది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్లో సానియా మీర్జా-అంకిత రైనా ద్వయం 7-6 (7/4), 6-0తో సుత్జియాది-నుగ్రోహో జంటను ఓడించి భారత్ విజయాన్ని ఖాయం చేసింది.
ఆరు జట్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో తలపడిన ఈ టోర్నీలో సానియా, రుతుజా, అంకిత, రియా భాటియా, సౌజన్య భవిశెట్టిలతో కూడిన భారత జట్టు నాలుగు మ్యాచ్ల్లో గెలిచింది. ఏప్రిల్లో జరిగే ప్లే ఆఫ్లో లాత్వియా లేదా నెదర్లాండ్స్ జట్టుతో భారత్ ఆడుతుంది.