లండన్: కరోనా వైరస్ మహమ్మారితో ఈ ఏడాది వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ రద్దయింది. అయితే టోర్నీ జరగకపోయినా ఆటగాళ్లకు ప్రైజ్మనీ దక్కనుంది. వింబుల్డన్ మెగా టోర్నీ కోసం సిద్ధమైన ఆటగాళ్ల పరిస్థితి ఏంటి?, వారి ఆర్థిక వ్యయప్రయాసల సంగతేంటి? అనే కోణంలో ఆలోచించిన ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ తమ ప్రతిష్టను పెంచే నిర్ణయం తీసుకుంది. మెయిన్ 'డ్రా' సహా క్వాలిఫయింగ్ ఈవెంట్ ఆడగలిగే అర్హతలున్న ఆటగాళ్లకు ప్రైజ్మనీ ఇవ్వాలని నిర్ణయించింది.
టోర్నీకి ఇప్పటికే బీమా సౌకర్యం ఉంది కాబట్టి.. మొత్తం ప్రైజ్మనీ 12.5 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ. 94 కోట్లు)ను ర్యాంకింగ్స్ ఆధారంగా టోర్నీకి అర్హులైన ఆటగాళ్లందరికీ పంచనున్నట్టు ఆల్ ఇంగ్లండ్ క్లబ్ నిర్వాహకులు శుక్రవారం ప్రకటించారు. 'టోర్నీ రద్దయిన వెంటనే ఆటగాళ్లకు సహాయం చేయడం ఎలా అన్నదాని గురించి ఆలోచించాం' అని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ ప్రధాన కార్యనిర్వహణ అధికారి రిచర్డ్ లూయిస్ చెప్పారు.
ఆటగాళ్ల ప్రైజ్మనీ కోసం కోటీ 66 వేల పౌండ్లతో (రూ. 94 కోట్లు) నిధిని కేటాయించింది. ప్రపంచ ర్యాంకింగ్ ఆధారంగా ఈ ప్రైజ్ మనీ వితరణ ఉంటుంది. టోర్నీ జరిగితే ప్రధాన డ్రాలో ఆడి ఉండే 256 మంది క్రీడాకారులకు ఒక్కొక్కరికి 31 వేల డాలర్లు, అర్హత పోటీల్లో తలపడి ఉండే 224 మందికి ఒక్కొక్కరికి 15600 డాలర్లు అందనున్నాయి. డబుల్స్ క్రీడాకారులకు తలో 7800 డాలర్లు ఇస్తారు. పురుషులు, మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల నుంచి మొత్తంగా 620 మంది క్రీడాకారులు లబ్ధి పొందనున్నారు.
షెడ్యూలు ప్రకారం జూన్ 29న వింబుల్డన్ ఆరంభం కావాల్సింది. కరోనా కారణంగా రద్దు చేయక తప్పలేదు. రెండో ప్రపంచ యుద్ధానంతరం వింబుల్డన్ పోటీలను రద్దు చేయడం ఇదే మొదటి సారి. 2003లో సార్స్ వచ్చినప్పుడు వింబుల్డన్ పోటీలకు భీమా తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏటా జీవిత భీమా కింద 2 మిలియన్ డాలర్లు ప్రీమియం కింద చెల్లిస్తూ వస్తున్నారు. భీమా తీసుకున్న 17 ఏళ్ల తర్వాత మొదటిసారి వింబుల్డన్ పోటీలు వాయిదా పడ్డాయి.
హాకీ ఇండియా అధ్యక్షుడి రాజీనామా.. కారణం అదేనా?!!