
హైదరాబాద్: కామన్వెల్త్ గేమ్స్లో ఫైనల్స్ లో కొద్దిగ తడబడిన భారత రెజ్లర్కు మౌసమ్ ఖత్రీకి రజితం దక్కింది. తొమ్మిదిరోజు పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన ఫైనల్ పోరులో ఖత్రీ ఓటమి పాలై రజతంతో సంతృప్తి చెందాడు. పురుషుల రెజ్లింగ్ 97 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో దక్షిణాఫ్రికాకు చెందిన మార్టిన్ ఎరాస్మస్ చేతిలో 12-2 తేడాతో ఖత్రీ పరాజయం చెందాడు.
క్వార్టర్ ఫైనల్లో సెప్రస్ అలెక్సియోస్, సెమీ ఫైనల్లో సోసో తామారౌలను ఓడించి ఫైనల్కు చేరిన ఖత్రీ.. తుది పోరులో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ప్రత్యర్థి ఎరాస్మస్కు లొంగిపోయిన ఖత్రీ రన్నరప్గా నిలిచి రజతంతో సరిపెట్టుకున్నాడు. 2010 ఆసియన్ గేమ్స్లో కాంస్య పతకం సాధించిన ఖత్రీ.. గతేడాది జరిగిన కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో రజతాన్ని సాధించాడు.
ఇతనితో పాటుగా పతకాలు గెలుచుకున్న మిగిలిన రెజ్లర్ల వివరాలిలా ఉన్నాయి. సుశీల్ కుమార్(75కేజీల విభాగంలో), రాహుల్ అవారే(57కేజీల) స్వర్ణం గెలిచారు. బబితా కుమారి(53కేజీల) రజత పతకం, కిరణ్ బిష్ణోయ్(76కేజీల) కాంస్య పతకం కొల్లగొట్టారు. కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా మూడోసారి స్వర్ణంతో మెరిసిన సుశీల్ కుమార్ హ్యాట్రిక్ సాధించాడు. పురుషుల 74 కేజీల ఫ్రీ స్టెల్ విభాగంలో కేవలం 80 సెకన్లలోనే దక్షిణాఫ్రికా రెజ్లర్ జొహాన్నెస్ బోథాపై విజయం సాధించాడు.
'జీవితం కంటే విలువైన వస్తువు మరొకటి లేదు. మూడోసారి స్వర్ణ పతకం గెలవడం నిజంగా మనందరం గర్వించదగ్గ విషయం. హిమాచల్ప్రదేశ్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అమాయక పిల్లలకు ఈ మెడల్ను అంకితం చేస్తున్నా' అని ట్విట్టర్లో పేర్కొన్నాడు.