వెల్లింగ్టన్: ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా గురువారం యుఏఈతో జరిగిన మ్యాచులో దక్షిణాఫ్రికా జట్టు సారథి ఏబి డివిలియర్స్ అద్భుత ప్రదర్శనతో ఆ జట్టు 146 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా క్వార్టర్స్ ఫైనల్లోకి సగర్వంగా ప్రవేశించింది. బ్యాటింగ్తోనేకాక బౌలింగ్ లోనూ ఆకట్టుకున్న డివిలియర్స్ రెండు వికెట్లు తీశాడు.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించి విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో డివిలియర్స్ 99(6ఫోర్లు, 4సిక్సులు), బెహార్డియన్ 64(64నాటౌట్) మెరుపులతో ఆరు వికెట్లు కోల్పోయి 341 పరుగులు చేసింది.
342 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యుఏఈ, దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి విలవిల్లాడిపోయింది. వరుసగా వికెట్లు పోగొట్టుకుంటూ ఏ దశలోనూ లక్ష్య ఛేదన దిశగా ముందుకు సాగలేదు. అయితే భాతర సంతతికి చెందిన యుఏఈ ఆటగాడు స్వప్నిల్ పాటిల్ 57 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు.
అతనికి మిగితా ఆటగాళ్లెవరూ తగిన సహకారం అందించకపోవడంతో చివరి వరకు పోరాడి యుఏఈకి గౌరవప్రదమైన ఓటమిని అందించాడు. యుఏఈ 47.3 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 195 పరుగులకే పరిమితమైంది. కాగా, చివరి బ్యాట్స్మెన్ పాహద్ గాయం కారణంగా బ్యాటింగ్కు రాలేదు. కాగా, ఈ విజయంతో దక్షిణాఫ్రికా పూల్ బిలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా తర్వాత స్థానాన్ని దక్కించుకుంది.
జింబాబ్వేతో దక్షిణాఫ్రికా మరో మ్యాచులో ఆడాల్సి ఉంది. ఆదివారం జరగనున్న పాకిస్థాన్-ఐర్లాండ్, వెస్టిండీస్-యుఏఈ మ్యాచుల అనంతరం క్వార్టర్స్లోకి వెళ్లే జట్టేవో తేలుతాయి.