హైదరాబాద్: ప్రభుత్వం తనకు ఉద్యోగం ఇచ్చి మద్దతుగా నిలబడితే దేశానికి మరిన్ని పేరు ప్రఖ్యాతులు తెస్తానని అంటున్నాడు ఛత్తీస్గడ్కు చెందిన పారా అథ్లెట్ శ్రీమంత్ ఝా. ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని బిలాయికి చెందిన శ్రీమంత్ ఝా ఆర్మ్ రెజ్లర్. అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో భారత్ తరుపున ప్రాతినిథ్యం వహించాడు.
ఆర్మ్ రెజ్లింగ్ విభాగంలో ఐదు వరల్డ్ ఛాంపియన్షిప్ మెడల్స్ను గెలిచాడు. ప్రస్తుతం శ్రీమంత్ ఝా ప్రస్తుతం ఆర్ధికంగా బాగాలేదు. దీంతో ఛత్తీస్ గడ్ ప్రభుత్వం తనకు ఉద్యోగం ఇచ్చిన తనతో పాటు తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాడు. 25 ఏళ్ల శ్రీమంత్ ఝా ప్రస్తుతం తన దృష్టంతా రాబోయే పారా ఒలింపిక్స్పై ఉందని తెలిపాడు.
పుట్టికతోనే రెండు చేతులకు నాలుగు వేళ్లతో జన్మించిన శ్రీమంత్ ఝా ఛత్తీస్గడ్ ప్రభుత్వం తనకు ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటే రాబోయే పారా ఒలింపిక్స్లో తప్పకుండా పతకం గెలుస్తానని ధీమా వ్యక్తం చేశాడు. శ్రీమంత్ ఝా మాట్లాడుతూ 'నా ప్రదర్శనను అడ్మినిస్ట్రేషన్ వారు చూడాలని కోరుతున్నా. వేరే రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులకు ప్రభుత్వాలు ఏ విధంగా సహకరిస్తున్నాయో, అదే విధంగా ఛత్తీస్ గడ్ ప్రభుత్వం నాకు సాయం చేయాలని అడుతున్నా. నా గేమ్పై దృష్టి సారించి రాబోయే ఒలింపిక్స్లో దేశానికి తప్పక పతకం గెలుస్తా' అని అన్నాడు.
శ్రీమంత్ ఝా తల్లి మనోర్మ ఝా మాట్లాడుతూ 'విదేశాల్లో భారత్ తరుపున గేమ్స్ ఆడేందుకు నా వద్ద ఉన్న బంగారం మొత్తం అమ్మేశా. నాలుగు సంవత్సరాల క్రితం నా భర్త ఉద్యోగం కోల్పోయాడు. ప్రస్తుతం మేము ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. నా కుమారుడి ఆరోగ్యం గురించి కూడా ఆవేదన చెందుతున్నా. సరైన ఆహారం లేకపోవడంతో అతడు వీక్ అవుతున్నాడు. ముఖ్యమంత్రి గారిని అభ్యర్ధిస్తున్నా. నా కుమారుడు ఉద్యోగానికి అర్హుడు' అని అన్నారు.
2010 నుంచి శ్రీమంత్ ఝా ఆర్మ్ రెజ్లింగ్లో శిక్షణ పొందుతున్నాడు. 2013 నుంచి భారత్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఏప్రిల్లో కజకిస్థాన్లో నిర్వహించిన ఆసియా ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో 80 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించాడు.
అంతకముందు పోలెండ్లో జరిగిన పారా-ఆర్మ్ రెజ్లింగ్ వరల్డ్ కప్ టోర్నీలో 80 కేజీల కేటగిరీలో సిల్వర్ పతకం గెలిచాడు. మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లమా పూర్తి చేసిన శ్రీమంత్ ఝా ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో జూనియర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు.