న్యూఢిల్లీ: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ.. జాతీయ క్రీడా పురస్కారాల విషయంలో విశాల హృదయం చాటుకుంది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం 'రాజీవ్ గాంధీ ఖేల్రత్న'ను అత్యధికంగా ఐదుగురికి అందజేయాలని నిర్ణయించింది. ఇదివరకే ఖరారైన జాబితా ప్రకారం.. క్రికెటర్ రోహిత్ శర్మ, పారాలింపిక్ స్వర్ణ పతక విజేత మరియప్పన్ తంగవేలు, మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్, టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా, మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్ ఖేల్రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ జాబితాకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ఆమోదముద్ర వేసింది.
ఇక అర్జున అవార్డుల జాబితాను కమిటీ ఎంపిక చేసిన 29 మందికి కాకుండా.. ఆ జాబితాను 27 మందికి కేంద్ర ప్రభుత్వం కుదించింది. గతంలో ఖేల్రత్న అవార్డు అందుకున్న వారికి తాజాగా అర్జున ఇవ్వరాదని క్రీడాశాఖ నిర్ణయించింది. దీంతో అర్జున రేసులో నిలిచిన రెజ్లర్ సాక్షి మాలిక్, వెయిట్లిఫ్టర్ మీరాబాయి చానుకు నిరాశ ఎదురైంది. సాక్షి 2016లో, చాను 2018లో ఖేల్రత్న అవార్డు అందుకున్నారు.
అర్జున అవార్డు రేసు నుండి తన పేరును తొలగించడంతో సాక్షి మాలిక్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. క్రీడా మంత్రిత్వ శాఖ వివరణతో సంతృప్తి చెందని సాక్షి.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడామంత్రి కిరెన్ రిజిజులకు ఓ లేఖ రాశారు. 'ఖేల్రత్న నాకు ఇచ్చినందుకు గర్వపడుతున్నా. అయితే ప్రతి అథ్లెట్ అన్ని అవార్డులను గెలుచుకోవాలని కలలు కంటారు. ఇందుకోసం అథ్లెట్లు తన ప్రాణాన్ని పళంగా పెడుతారు. నేను కూడా అర్జున అవార్డు సాధించాలని కలలు కన్నాను. అదే నా డ్రీమ్. దేశం కోసం ఏ మెడల్ గెలిస్తే.. నాకు అర్జున అవార్డు ఇస్తారు?. ఈ రెగ్లింగ్ జీవితంలో ఈ అవార్డును గెలుచుకునే అదృష్టం నాకు ఉందా?' అని లేఖలో సాక్షి ప్రశ్నించారు.
माननीय प्रधानमंत्री @narendramodi जी ओर माननीय खेल मंत्री @KirenRijiju जी । pic.twitter.com/YF1hQuJfPi
— Sakshi Malik (@SakshiMalik) August 22, 2020
సాక్షి మాలిక్ 2017లో జరిగిన కామన్వెల్త్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం, న్యూఢిల్లీలో జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో రజతం గెలుచుకున్నారు. గోల్డ్కోస్ట్లో జరిగిన 2018 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం కూడా సాధించారు. ప్రతి యేటా జాతీయ క్రీడా పురస్కారాలను జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్లో ఘనంగా నిర్వహిస్తారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి వర్చువల్ విధానంలో పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
CPL 2020: టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న సెయింట్ కిట్స్!!