రెండూ ఒకటే కానీ..
ఒలింపిక్స్.. పారాలింపిక్స్ రెండింట్లోనూ జరిగే క్రీడలకు తేడా ఏమీ ఉండదు. కానీ పాల్గొనే అథ్లెట్లు మాత్రం విభిన్నం. క్రీడల్లో అపార ప్రతిభ చూపడంతో పాటు అంగవైకల్యం కలిగిన వారే పారా గేమ్స్లో పాల్గొంటారు. అయితే ఒలింపిక్స్కు 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నా పారాలింపిక్స్ మాత్రం ఆరు దశాబ్దాల నుంచే జరుగుతున్నాయి.
1960, రోమ్లో మొదటిసారిగా ఈ గేమ్స్ ప్రారంభమయ్యాయి. అప్పట్లో 23 దేశాల నుంచి 400మంది అథ్లెట్లు మాత్రమే పాల్గొన్నారు. కానీ తాజాగా జరగబోతున్న టోక్యో పారాలింపిక్స్లో 160 దేశాల నుంచి 4,400 మంది తమ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నారు.
పేరు ఎలా వచ్చిందంటే..?
పారాలింపిక్స్ అనే పేరులో ఏదో తెలియన అర్థముందనిపించినా అలాంటిదేమీ లేదు. ఒలింపిక్కు ప్యారలల్గా జరిగే క్రీడలు కాబట్టి వీటిని పారాలింపిక్స్గా వ్యవహరిస్తుంటారు. అలాగే ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో కూడిన ఎజిటోస్ (లాటిన్లో.. 'నేను ముందుకెళ్లగలను')ను పారా చిహ్నంగా భావిస్తారు.
అసలు పారాలింపిక్స్ ఆరంభం వెనుక మరో కథ ఉంది. 1948లో ఇంగ్లండ్లోని స్టోక్ మండెవిల్లే అనే గ్రామంలో ఓసారి పోటీలు జరిగాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో పాల్గొన్న 16 మంది పురుషులు, మహిళలు వీల్చెయిర్స్తోనే తమ ప్రతిభను చాటారు. తదనంతరం ఈ క్రీడలనే ఆదర్శంగా తీసుకుని పుట్టుకొచ్చిన పారాలింపిక్స్ నేడు విశ్వవ్యాప్తమై అలరిస్తున్నాయి.
కరోనా కేసులు పెరుగుతున్నా..
ఒలింపిక్స్ మాదిరే ఈ గేమ్స్ కూడా ప్రేక్షకుల్లేకుండానే జరుగబోతున్నాయి. రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులతో ఓవైపు ఆందోళన నెలకొంది. అందుకే ఒలింపిక్ విలేజ్, వేదిక, శిక్షణ స్థలానికి తప్ప పారా అథ్లెట్లు మరెక్కడా తిరగడానికి అనుమతి లేదు. అలాగే వారి ఈవెంట్స్ ముగిసిన రెండు రోజుల్లోపే ఒలింపిక్స్ గ్రామం వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఇక పారాలింపిక్స్లో మొత్తం 22 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. ఈసారి కొత్తగా తైక్వాండో, బ్యాడ్మింటన్కు కూడా చోటు కల్పించారు.
మూడు కేటగిరీలుగా అథ్లెట్లు..
ప్రధానంగా అథ్లెట్లను మూడు కేటగిరీలుగా విభజిస్తారు. శారీరక వైక్యలం, అంధత్వం, బుద్ధి మాంద్యం కలిగిన వారు ఇందులో ఉంటారు. కొన్ని క్రీడల్లో మూడు విభాగాల వారు తలపడేందుకూ అవకాశం ఉంటుంది. కొన్నింట్లో మాత్రం వైకల్య శాతాన్ని లెక్కలోకి తీసుకుంటారు. మరోవైపు చూపులేని రేసర్లు పోటీ సమయంలో సహాయకులను పెట్టుకోవచ్చు. స్విమ్మింగ్లో అయితే సూచనల కోసం టర్న్ అయ్యేటప్పుడు, పోటీ ముగిశాక వారి తలలపై సహాయకులు టచ్ చేస్తుంటారు.
భారత పతకాల సంఖ్య 12
పారాలింపిక్స్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకు 12 మెడల్స్ గెలిచింది. ఇందులో అత్యధికంగా రియో పారాలింపిక్స్ నాలుగు మెడల్స్ సాధించింది. ఇందులో రెండు స్వర్ణాలు, ఓ రజతం, కాంస్యం ఉన్నాయి. 2012లో ఒకే ఒక సిల్వర్ మెడల్తో సరిపెట్టిన భారత దివ్యాంగ క్రీడాకారులు.. 2004లో ఓ స్వర్ణం, కాంస్యం, 1984లో రెండు రజతం, రెండు కాంస్యంతో నాలుగు పతకాలు సాధించారు. అంతకుముందు 1972లో ఓ కాంస్యం నెగ్గారు. ఇప్పటి వరకు అథ్లెటిక్స్లో అత్యధికంగా 10 పతకాలు రాగా.. పవర్ లిఫ్టింగ్లో ఒకటి(కాంస్యం), స్విమ్మింగ్లో ఒక(స్వర్ణం) పతకం వచ్చింది.
భారత ఫ్లాగ్ బేరర్..
ఆరంభ వేడుకల్లో భారత్ నుంచి ఐదుగురు అథ్లెట్లు, ఆరుగురు అధికారులు మాత్రమే పాల్గొంటున్నారు. అథ్లెట్ల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. అయితే భారత్ నుంచి ఇప్పటివరకు ఏడుగురే టోక్యోకు చేరుకున్నారు. ఇందులో టేబుల్ టెన్నిస్ ప్లేయర్స్ ఇద్దరికి బుధవారమే పోటీలు ఉండడంతో వారు వేడుకల్లో పాల్గొనడం లేదు. ఇక హైజంపర్ తంగవేలు భారత ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించనున్నాడు.