హైదరాబాద్: ప్రొఫెషనల్ బాక్సర్గా తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న విజేందర్ సింగ్, చైనాకు చెందిన జుల్పికర్ మైమైతియాలితో కీలక పోరుకు సిద్ధమయ్యాడు. ముంబైలో శనివారం వీరిద్దరి మధ్య బాక్సింగ్ పోటీ జరగనుంది. విజేందర్ సింగ్ ప్రొఫెషల్ బాక్సర్గా మారిన తర్వాత తలపడ్డ 8 సార్లు విజయమే సాధించాడు.
ఇక జుల్పికర్ కూడా ప్రొ బౌట్లలో ఓడిపోలేదు. ఈ నేపథ్యంలో శనివారం జరగనున్న ఈ మ్యాచ్లో జుల్పికర్ను మట్టికరిపించాలని విజేందర్ తహతహలాడుతున్నాడు. ఈ బౌట్లో గెలిస్తే విజేందర్కు రెండో డబ్ల్యూబీఏ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ దక్కుతుంది.
ఈ మ్యాచ్ను వీక్షించేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూడా విజేందర్ ఆహ్వానించాడు. చైనా వస్తువులు మన్నిక తక్కువ, అవి ఎక్కువ కాలం మన్నలేవంటూ తనతో పోటీలో చైనా బాక్సర్ ఎక్కువసేపు నిలువలేడంటూ పరోక్షంగా జుల్పికర్కు ఇటీవలే విజందర్ చురకలంటించిన సంగతి తెలిసిందే.
శుక్రవారం మీడియాతో మాట్లాడిన విజేందర్ శనివారం భారత్, చైనా మధ్య పోరు జరగనుందని పేర్కొన్నాడు. 'భారత్ మొత్తం నాతో ఉంది. ఇది చైనాతో భారత్ పోరు. జుల్పికర్కు అనుభవం తక్కువ. కానీ బలమైన ప్రత్యర్థే' అన్నాడు. మరోవైపు 2014లో ప్రొఫెషనల్ బాక్సర్గా మారిన జుల్పికర్ కూడా విజేందర్పై గెలిచేందుకు శక్తి మేర ప్రయత్నిస్తానని చెప్పాడు.
భారత్, చైనా మధ్య డోక్లాం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ బౌట్కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక భారత్, చైనా మధ్య డోక్లాం వివాదం గురించి మీ అభిప్రాయం ఏంటని జుల్ఫికర్ని మీడియా ప్రతినిధులు అడగ్గా రాజకీయాలు, క్రీడలకు సంబంధం లేదని అన్నాడు.
మ్యాచ్ షెడ్యూల్:
శనివారం సాయంత్రం 6.30 నుంచి సోనీ టెన్-1లో