జమైకా: ఆల్ టైమ్ గ్రేట్ స్ప్రింటర్, జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ పరుగులు తీయడంలో తన తర్వాతే ఎవరైనా అని నిరూపించాడు. సుమారు తొమ్మిది సంవత్సరాల పాటు తన హవా కొనసాగించాడు. ఇక ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో తనదైన ముద్ర వేసిన బోల్ట్.. తాజాగా మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19)పై తనదైన స్టయిల్లో స్పందించాడు. వైరస్ అంతకంతకు విస్తరిస్తున్న నేపథ్యంలో అందరూ సామాజిక దూరం పాటించాలని సూచించాడు.
ఏ ప్రాతిపదికన ధోనీని జట్టులోకి ఎంపిక చేస్తారు: గౌతమ్ గంభీర్
12 ఏళ్ల క్రితం బీజింగ్లో జరిగిన ఒలింపిక్స్లో బరిలోకి దిగిన ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల, 200 మీటర్ల రేసులలో ప్రపంచ, ఒలింపిక్ రికార్డులు నెలకొల్పాడు. తనకు తిరుగులేని 100 మీటర్ల రేసును రికార్ఢు స్థాయిలో 9.69 సెకన్లలో ముగించి ఔరా అనిపించాడు. ఈ పరుగులో అమెరికా అథ్లెట్ రిచర్డ్ థాంప్సన్ను 0.20 సెకన్ల తేడాతో అధిగమించి బోల్ట్ పసిడి పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అయితే లక్ష్యాన్ని ఇంకా చేరుకోకముందే.. చాతిపై చేతితో బాదుతూ సంబురాల్లో మునిగిపోయాడు బోల్ట్.
ప్రస్తుతం కొవిడ్-19తో అతలాకుతలమవుతున్న ప్రపంచ దేశాలకు సందేశమిచ్చే విధంగా బీజింగ్ ఒలింపిక్స్ ఫొటోను ఉసేన్ బోల్ట్ షేర్ చేసాడు. ఆ ఫొటోలో అందరు అథ్లెట్లు తమకు కేటాయించిన నంబర్లలో పరుగు తీస్తున్నారు. ఇలా దూరంగా ఉండి కరోనాపై విజయం సాధిద్దాం అని బోల్ట్ ట్వీట్ చేసాడు. 'సామాజిక దూరం పాటించండి' అని ఫొటోకు కాప్షన్ ఇచ్చి.. హ్యాపీ ఈస్టర్ అంటూ హాష్ ట్యాగ్ జతచేసాడు.
Social Distancing #HappyEaster pic.twitter.com/lDCAsxkOAw
— Usain St. Leo Bolt (@usainbolt) April 13, 2020
తన కెరీర్లో ఉసేన్ బోల్ట్ అనేక ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఒలింపిక్స్లో ఎనిమిదిసార్లు బంగారు పతకాలను సాధించి ప్రపంచంలోనే అత్యుత్తమ అథ్లెట్గా ఉసేన్ బోల్ట్ నిలిచిన సంగతి తెలిసిందే. 2017లో లండన్ వేదికగా జరిగిన ప్రపంచ అథ్లెట్ ఛాంపియన్షిప్ అనంతరం బోల్ట్ అథ్లెటిక్స్ నుంచి రిటైరయ్యాడు. బోల్ట్ చివరిసారిగా ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో 100 మీటర్ల స్ప్రింట్ విభాగంలో పోటీ పడ్డాడు. అయితే తన కెరీర్ చివరి రేసులో మాత్రం చిన్నబోయాడు. ఎవ్వరూ ఊహించని విధంగా మూడో స్థానంలో నిలిచాడు.