
హైదరాబాద్: షూటర్ ప్రియా సింగ్కు ఆర్ధిక కష్టాలను తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆమె ప్రయాణానికి, వసతికి అయ్యే ఖర్చుల కోసం వెంటనే రూ.4.5లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
వివరాల్లోకి వెళితే... ఉత్తర్ప్రదేశ్కు చెందిన 19 ఏళ్ల ప్రియా సింగ్ జూన్ నెలాఖరున జర్మనీలో జరిగే ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్కు అర్హత సాధించిన ఆరుగురు మహిళల జట్టులో చోటు దక్కించుకుంది. జర్మనీ వెళ్లే మహిళల జట్టులో ప్రియాది నాలుగో స్థానం కావడం విశేషం. నిబంధనల ప్రకారం తొలి మూడు స్థానాల్లో ఉన్న షూటర్లకు ప్రభుత్వమే ఖర్చులు భరిస్తోంది.
ఆ తర్వాతి వారు మాత్రం వారే తమ ఖర్చులు భరించుకోవాలి. ప్రియా జర్మనీ వెళ్లి పోటీల్లో పాల్గొని తిరిగి భారత్ రావడానికి సుమారు రూ.4.5లక్షలు కావాల్సి ఉంది. కాగా, ప్రియా తండ్రి బ్రిజ్పాల్ సింగ్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. నెలకు రూ.10వేలు సంపాదిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. దీంతో ఆమె పోటీల్లో పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి.
ఎలాగైనా సరే తన కుమార్తెని పోటీలకు పంపించాలని తనకు తెలిసిన వారందరినీ డబ్బులు అప్పుగా ఇవ్వాలని కోరాడు. కానీ, ఎక్కడా డబ్బు దొరకలేదు. దీంతో చివరికి ఇంట్లో ఉన్న గేదెలను అమ్మి రూ.50వేల వరకు సర్దుబాటు చేయగలిగాడు. ఇక, మిగతా డబ్బు కోసం నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ఆర్ఏఐ) అధికారులను అడిగాడు.
"జర్మనీ పోటీల్లో ప్రియా వాడే రైఫిల్కు అనుమతి తీసుకున్నాం. కానీ, ఆర్థికంగా మేము ఏం చేయలేం. నిబంధనల ప్రకారం తొలి మూడు స్థానాల్లో చోటు దక్కించుకున్న వారికి మాత్రమే మేము ఖర్చులు భరించాల్సి ఉంటుంది" అని చెప్పారు. దీంతో ప్రియా ఆర్ధిక పరిస్థితి సరిలేని కారణంగా ప్రపంచకప్ పోటీల్లో పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ వార్తలు ఆ నోటా ఈ నోటా పడి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరకు వెళ్లాయి. ఈ వార్తలపై స్పందించిన ఆయన ఆమె ప్రయాణానికి, వసతికి అయ్యే ఖర్చుల కోసం తక్షణం రూ.4.5లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఆమె జర్మనీకి వెళ్లే ఏర్పాట్లు దగ్గరుండి చూడాలని మేరఠ్ జిల్లా కలెక్టర్కు యోగి ఆదేశాలు జారీ చేశారు.
దీంతో ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్కు ఆమె ధన్యవాదాలు చెప్పింది. జర్మనీలో జరగనున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్లో ప్రియా సింగ్ 50మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో పాల్గొననుంది.