
హైదరాబాద్: ఐఏఏఎఫ్ ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో స్వర్ణం గెలిచిన భారత తొలి మహిళా అథ్లెట్గా హిమ దాస్ చరిత్ర సృష్టించింది. ఫిన్లాండ్ వేదికగా జరిగిన ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన హిమ దాస్.. 400 మీటర్ల పరుగులో విజేతగా నిలిచింది. ఈ ఛాంపియన్షిప్లో ఓ భారత అథ్లెట్ ట్రాక్ ఈవెంట్లో బంగారు పతకం గెలుపొందడం ఇదే తొలిసారి.

అస్సాంకి చెందిన 18 ఏళ్ల హిమ దాస్ ఫైనల్లో 400మీ పరుగుని కేవలం 51.46 సెకన్లలోనే పూర్తి చేసి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఆమె తర్వాత స్థానంలో రొమేనియా అథ్లెట్ మిక్లో 52.07 సెకన్లతో రజతం గెలవగా.. అమెరికాకి చెందిన టేలర్ మన్సన్ 52.28 సెకన్లతో కాంస్యానికి పరిమితమైంది.
ఈ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన సెమీ ఫైనల్లో 52.10 సెకన్లలో 400మీ పరుగును పూర్తి చేసిన హిమ దాస్.. మంగళవారం జరిగిన మొదటి రౌండ్లో 52.25 సెకన్లు తీసుకోవడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్లో ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో అసోంకు చెందిన హిమ గోల్ట్కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో 51.32 టైమింగ్తో ఆరో స్థానంలో నిలిచింది.
2016లో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో కొత్త ప్రపంచ రికార్డుతో నీరజ్చోప్రా అథ్లెటిక్స్లో భారత్కు తొలి బంగారు పతకం అందించిన విషయం తెలిసిందే. కాగా, మహిళల విభాగంలో ప్రపంచకప్ డిస్కస్ త్రోలో 2014లో నవ్నీత్ కౌర్(కాంస్యం), 2002 ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్ డిస్కస్త్రోలో సీమా పునియా(కాంస్యం) సాధించారు. తాజాగా ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో ఫేవరెట్గా బరిలోకి దిగిన యువ హిమదాస్ స్వర్ణంతో మెరిసి తొలి స్వర్ణం సాధించిన భారతీయురాలిగా ఘనత సాధించింది.