
టోక్యో: ప్రతిష్ఠాత్మకంగా సాగుతోన్న ఒలింపిక్స్ 2021లో ప్రాణాంతక కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో వేర్వేరు దేశాలకు చెందిన అథ్లెట్లు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఒలింపిక్స్ నుంచి తప్పుకొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి నిర్వాహకులు.. ప్రభుత్వ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నప్పటికీ- టోక్యో సిటీలో మాత్రం కరోనా వైరస్ విజృంభిస్తోంది. కలకలం రేపుతోంది. ఎప్పుడూ లేనంతగా కరోనా వైరస్ కొత్త కేసులు నమోదయ్యాయి.
మంగళవారం సాయంత్రం అధికారులు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. 24 గంటల వ్యవధిలో టోక్యో సిటీలో 2,848 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది రికార్డు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత ఈ ఏడాదిన్నర కాలంలో ఎప్పుడూ గానీ ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కానేలేదు. ఒలింపిక్స్ ఆరంభమైన అయిదో రోజే రికార్డు స్థాయిలో కొత్త కేసులు పుట్టుకుని రావడం టోక్యో అధికార యంత్రాంగాన్ని ఉలికిపడేలా చేస్తోంది. దీనితో కొత్త కేసులు అధిక సంఖ్యలో నమోదైన ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను విధించారు.
టోక్యో ఒలింపిక్స్ విలేజ్లో ఇప్పటికే 155 కేసులు నమోదయ్యాయి. ఒలింపిక్స్తో ముడిపడి ఉన్న ఏడుమంది కొత్తగా కరోనా వైరస్కు గురయ్యారు. ఇప్పటిదాకా పలువురు అథ్లెట్లు, సపోర్టింగ్ స్టాఫ్ కరోనా బారిన పడ్డారు. టోక్యోలో ఆదివారం నాడు ఒక్కరోజులోనే 12,635 మంది కోవిడ్ పేషెంట్లు ఆసుపత్రుల్లో చేరారు. ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్ల ఆక్యుపెన్సీ రేషియో 20.8 శాతంగా నమోదైంది. 25 శాతం మేర కొత్త కేసులు నమోదైన ప్రతి ప్రాంతంలోనూ అత్యవసర పరిస్థితులను విధించాల్సి ఉంటుందని జపాన్ ప్రభుత్వం నియమించిన కోవిడ్ అడ్వైజరీ ప్యానెల్ సిఫారసు చేసింది. దీనికి అనుగుణంగా టోక్యలోని పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు.
కరోనా కేసులు పెరగడం, ఒలింపిక్స్ కొనసాగుతుండటం వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. టోక్యో ఒలింపిక్స్ విలేజ్లోకి ఎవ్వరినీ ప్రవేశించనివ్వట్లేదు. కమిటీ అధికారికంగా నియమించుకున్న వలంటీర్ల సంఖ్యను కూడా పరిమితం చేశారు అధికారులు. అలాగే- ఆసుపత్రుల్లో బెడ్స్ సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించింది. ఇప్పుడున్న 5,967 బెడ్స్ సంఖ్యను వచ్చే వారం నాటికి 6,406కు పెంచాలని అధికారులు నిర్ణయించారు.