|
రన్నరప్గా
కొద్దిసేపటి ముగిసిన బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్ 4 కేటగిరి ఫైనల్స్ మ్యాచ్లో భారత్కు ప్రాతినిథ్యాన్ని వహించిన పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ సుహాస్ లలినకెరె యతిరాజ్ పరాజయాన్ని చవి చూశారు. ఇప్పటికే ఫైనల్స్ చేరడంతో ఆయనకు రజతం ఖాయమైంది. రన్నరప్గా రెండో స్థానంలో నిలిచారు. ఫైనల్స్ మ్యాచ్లో ఫ్రాన్స్ స్టార్ పారాబ్యాడ్మింటన్ ప్లేయర్ లుకాస్ మజూర్ చేతిలో ఓటమి పాలయ్యారు. రన్నరప్గా నిలిచి రజతాన్ని అందుకున్నారు.
|
స్వరాష్ట్రం కర్ణాటక..
సుహాస్ ఎల్ యతిరాజ్ స్వరాష్ట్రం కర్ణాటకలోని హాసన్ జిల్లా దుద్ద గ్రామం. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఆయన విద్యాభ్యాసం సాగింది. 2007లో సుహాస్ సివిల్స్కు ఎంపికయ్యారు. ఉత్తర ప్రదేశ్ క్యాడర్ అధికారిగా పోస్టింగ్ లభించింది. ప్రస్తుతం గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా కలెక్టర్గా పని చేస్తోన్నారు. గ్రేటర్ నొయిడా ప్రాంతం ఈ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఆయన కాలిమడమలో బలహీనత కారణంగా పారాబ్యాడ్మింటన్ ప్లేయర్ అయ్యారు.
|
సెమీస్లో తిరుగులేని విజయం..
పారాబ్యాడ్మింటన్లో ఆయన వరల్డ్ ర్యాంకర్ కూడా. ప్రపంచ ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉన్నారు. టోక్యో పారాలింపిక్స్ సెమీపైనల్స్లో అద్భుతంగా ఆడారు సుహాస్. తన ప్రత్యర్థిని మట్టికరిపించారు. సెమీస్లో ఇండోనేషియాకు చెందిన ఫ్రెడీ సెతియవాన్ను 21-9, 21-15తో ఓడించారు. ఫైనల్స్లో అడుగు పెట్టారు. సెమీఫైనల్స్లో అడుగు పెట్టడంతోనే భారత్కు పతకం ఖాయమైంది. దాన్ని ఆయన ఇంకా మెరుగుపర్చుకున్నారు. ఫైనల్స్లోకి ప్రవేశించడంతో రజతం ఖాయమైంది.
|
హోరాహోరీ పోరు..
బంగారు పతకం కోసం సాగిన పోరులో దూకుడును ప్రదర్శించలేకపోయారు. మ్యాచ్ను మూడు సెట్ల వరకు తీసుకెళ్లగలిగినా.. విజయాన్ని అందుకోలేకపోయారు. తొలి సెట్లో సుహాస్ అద్భుతంగా ఆడారు. 21-15 స్కోర్తో దాన్ని సొంతం చేసుకున్నారు. రెండో సెట్లో లుకాస్ విజృంభించాడు. మెరుపులాంటి షాట్లను ఆడాడు. సుహాస్-లుకాస్ మధ్య హోరాహోరీగా సాగింది ఈ సెట్. చివరికి 17-21 తేడాతో రెండో సెట్ను కోల్పోయాడు.
|
మూడో సెట్లో
నిర్ణయాత్మకమైన మూడో సెట్లోనూ ఇద్దరి మధ్య హైఓల్టేజ్ పోరు సాగింది. ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని ప్రదర్శించుకుంటూ వెళ్లారు. ఒకదశలో లుకాస్ కంటే ముందంజలో నిలిచారు. ఆ దూకుడును సుహాస్ చివరి వరకూ కొనసాగించలేకపోయారు. ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. దాన్ని విజయంగా మలచులేకోవడంలో విఫలం అయ్యారు. మూడో సెట్లో 21-15 స్కోర్ తేడాతో ఓడిపోయారు. దీనితో పరాజయం తప్పలేదు. తృటిలో పసిడి పతకాన్ని కోల్పోయారు.
|
హర్షాతిరేకాలు..
సుహాస్ యతిరాజ్కు రజత పతకాన్ని లభించడం పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్త చేశారు. కోట్లాదిమంది యువతకు స్ఫూర్తి ఇచ్చారని ప్రశంసించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. సుహాస్ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. భారతీయ యువత శక్తి సామర్థ్యాలు ఏమిటో అత్యున్నత క్రీడా వేదికపై చాటి చెప్పారని అన్నారు. సుహాస్ భార్య, ఘజియాబాద్ అసిస్టెంట్ కలెక్టర్ రీతూ సుహాస్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పతకం కోసం ఆయన ఆరు సంవత్సరాల పాటు కఠోరంగా శ్రమించారని అన్నారు.