టోక్యో: నీరజ్ చోప్రా.. టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్కు పసిడి పతకాన్ని అందించిన మొనగాడు. కొన్ని దశాబ్దాల తరువాత తొలిసారిగా ఒలింపిక్స్లో భారత్ స్వర్ణ పతకాన్ని అందుకునేలా చేశాడీ జావెలిన్ థ్రోయర్. ఎవ్వరూ అందుకోనంత దూరం జావెలిన్ను సంధించి.. స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు అదే జావెలిన్ కేటగిరీలో భారత్ పతకాల పంటను పండించింది. నీరజ్ చోప్రాను స్ఫూర్తిగా తీసుకుని వరుస మెడల్స్ను సాధించారు భారత జావెలిన్ థ్రోయర్లు.
టోక్యో పారాలింపిక్స్లో భారత్కు స్వర్ణపతకం: చరిత్ర సృష్టించిన టీనేజర్
టోక్యో వేదికగా సాగుతోన్న పారాలింపిక్స్లో పురుషుల జావెలిన్ థ్రో ఎఫ్46 విభాగంలో భారత్కు రెండు పతకాలు లభించాయి. ఈ కేటగిరీకి ప్రాతినిథ్యాన్ని వహించిన దేవేంద్ర జజ్ఝారియా, సుందర్ సింగ్ వరుస పతకాలను అందుకున్నారు. ఈ కేటగిరీలో బంగారు పతకం తప్ప.. మిగిలిన రెండూ భారత్ వశం అయ్యాయి. దేవేంద్ర జజ్ఝారియా రజతాన్ని సొంతం చేసుకోగా.. సుందర్ సింగ్ కాంస్యాన్ని అందుకున్నాడు. దేవేంద్ర జజ్ఝారియా 64.35 మీటర్ల దూరం పాటు జావెలిన్ను సంధించాడు.
సుదర్ సింగ్ అతని కంటే కాస్త తక్కువ అంటే 64.01 మీటర్ల దూరం పాటు బల్లెన్ని విసిరాడు. ఈ కేటగరిలో శ్రీలంక బంగారు పతకాన్ని ముద్దాడింది. శ్రీలంక జావెలిన్ థ్రోయర్ దినేష్ ప్రియన్ హెరాత్ ముడియన్సెలగె స్వర్ణాన్ని ఎగరేసుకెళ్లాడు. ఏకంగా 67.79 మీటర్ల దూరం పాటు జావెలిన్ను విసిరాడతను. ఇది ప్రపంచ రికార్డు. ఇదే కేటగిరీలో భారత్కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న అజీత్ నిరాశ పరిచాడు. అతను 56.15 మీటర్ల దూరం మాత్రమే జావెలిన్ను విసరగలిగాడు.
సుందర్ సింగ్తో ఈ కేటగిరీ ప్రారంభమైంది. తన తొలి ప్రయత్నంలో అతను 64.01 మీటర్ల దూరానికి జావెలిన్ను విసిరాడు. ఫైనల్స్కు అర్హత సాధించాడు. అనంతరం 3, 4 రౌండ్లల్లో వెనుకపడినప్పటికీ.. నిర్ణయాత్మకమైన అయిదో రౌండ్లో పుంజుకొన్నాడు. మెడల్ కోసం క్వాలిఫై అయ్యాడు. ఆ తరువాత దేవేంద్ర జజ్ఝారియా సైతం దూకుడు ప్రదర్శించాడు. చివరి అటెంప్ట్లో అతను 61.23 మీటర్ల దూరానికి జావెలిన్ను విసిరాడు.
దీనితో భారత్కు రెండు పతకాలు ఖాయం అయ్యాయి. 2016 రియో డీ జనేరియోలో నిర్వహించిన పారాలింపిక్స్లో దేవంద్ర జజ్ఝారియా పాల్గొన్నాడు. అందులో అతను స్వర్ణాన్ని అందుకున్నాడు. రియో పారాలింపిక్స్లో అతని కేరీర్ బెస్ట్ 63.97 మీటర్ల దూరానికి జావెలిన్ను సంధించాడు దేవేంద్ర. 2004 ఏథెన్స్లో పారాలింపిక్స్లోనూ దేవేంద్ర బంగారు పతకాన్ని సాధించాడు. ఈ సారి కూడా అతనిపై అనేక అంచనాలు ఉన్నప్పటికీ.. దాన్ని నిరాశ పర్చలేదు. రజతాన్ని కైవసం చేసుకున్నాడు.