
టోక్యో: కరోనా వైరస్ మహమ్మరి ఉన్నా, లేకున్నా 2021 జులై 23నే ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం అవుతాయని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వైస్ ప్రెసిడెంట్ జాన్ కోట్స్ స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి విజృంభణ కారణంగా 2020లో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. జాన్ కోట్స్ సోమవారం ఓ మీడియా సంస్థతో ఫోన్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రపంచ యుద్ధాల సమయంలో మాత్రమే ఒలింపిక్స్ క్రీడలు రద్దయ్యాయని, సవరించిన తేదీన ప్రకారమే యథావిధిగా నిర్వహిస్తామని వెల్లడించారు.
'కరోనా వైరస్ ఉన్నా, లేకున్నా ఒలింపిక్ క్రీడలు జరుగుతాయి. జులై 23న టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం అవుతాయి. సునామి వినాశనం తరవాత పునర్నిర్మాణ క్రీడలు అనే థీమ్తో ముందుకెళ్తున్నాం. ఇవి కరోనాను జయించే క్రీడలు కానున్నాయి. చీకట్లను తరిమికొట్టే వెలుగుకు దగ్గర్లో ఉన్నాం' అని జాన్ కోట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. జపాన్ సరిహద్దులు ఇప్పటికీ మూసివేయబడ్డాయి. సందర్శకులకు ఇంకా ప్రవేశం లేదు.
2011లో భూకంపం, సునామి జపాన్లో అల్లకల్లోలం సృష్టించాయి. ఆ విపత్తు నుంచి కోలుకొని ఈ అంతర్జాతీయ క్రీడలకు జపాన్ దేశం సిద్ధంగా ఉందని ఈ థీమ్ అర్థం. విదేశీ సందర్శకుల ప్రయాణాలపై జపాన్ ఇంకా ఆంక్షలు కొనసాగిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఎంత సమయం పడుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. నెలలు కావొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. ఈ తరుణంలో క్రీడల నిర్వహణ సాధ్యమైనా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఎక్కువ మంది మరోసారి విశ్వ క్రీడలను వాయిదా వేయాలని కోరుకున్నారట.
పరిమిత సంఖ్యలో హాజరయ్యే ప్రేక్షకుల మధ్య వచ్చే ఏడాదికి వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్ జరుగొచ్చని నిర్వాహక కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తషిరో ముటో గతంలో అభిప్రాయపడ్డారు. 'వచ్చే ఏడాది ఒలింపిక్స్ జరుగడంపైనే అందరి దృష్టి ఉంది. మేం కూడా విశ్వక్రీడలను నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం. భౌతిక దూరం పాటించేలా పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించాలని థామస్ బాచ్(ఐఓసీ చీఫ్) కూడా ఆలోచిస్తున్నారు. మేం కూడా అందుకే ప్రణాళిక రచిస్తున్నాం. ప్రజలు సురక్షితంగా ఫీలయ్యే వాతావరణాన్ని మేం కల్పిస్తాం' అని ఆయన అన్నారు.