
టోక్యో: జపాన్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ 2021లో నాలుగో రోజు భారత పరాజయాల పరంపరకు బ్రేకులు పడట్లేదు. ఒకదాని వెంట ఒకటిగా అపజయాలు పలకరిస్తూనే వస్తోన్నాయి. ఆరంభంలో అదరగొట్టిన భారత అథ్లెట్లు.. తరువాతి రౌండ్లలో చతికలి పడుతోన్నారు. పరాభవాలను మూటగట్టుకుంటోన్నారు. ఫెన్సర్ చదలవాడ భవానీదేవితో ఆరంభమైన విజయాలు.. మలి రౌండ్లో ఆమె పరాజయంతోనే మొదలయ్యాయి. టేబుల్ టెన్నిస్, పురుషుల అర్చరీ, పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్, పురుషుల టెన్నిస్ సింగిల్స్.. ఇలా అన్నింట్లోనూ భారత అథ్లెట్లు చేతులెత్తేశారు.
తాజాగా టేబుల్ టెన్నిస్ విభాగంలోనూ అదే రకమైన ఫలితం ఎదురైంది. భారత స్టార్ పెడ్లర్ మణికా బాత్రా.. మూడో రౌండ్లో ఓడిపోయారు. టోక్యో మెట్రోపాలిటన్ జిమ్- టేబుల్ 1పై జరిగిన ఈ రౌండ్లో మణికా వరుస సెట్లలో ఓటమి చవి చూశారు. 11-8, 11-2, 11-5, 11-7 స్కోర్ తేడాతో ఆస్ట్రియాకు చెందిన సోఫియా పోల్కనోవా చేతిలో పరాజయం పాలయ్యారు. 27 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. తొలి సెట్లో తీవ్రంగా ప్రతిఘటించిన మణికా బాత్రా.. మలి సెట్లలో ఆ ఊపును కొనసాగించలేకపోయారు. ఏ దశలో కూడా తన ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయారు. పెడ్లర్ సోఫియా పోల్కనోవా మ్యాచ్ అసాంతం పట్టు కొనసాగించారు.
మణికా బాత్రా ప్రధాన బలం రివర్స్ స్పిన్. అదే ఆయుధాన్ని ప్రత్యర్థులపై ప్రయోగించి.. తొలి, మలి రౌండ్లలో ఘన విజయాలను అందుకున్నారు. అదే మంత్రం ఆస్ట్రియా ప్రత్యర్థి ముందు పని చేయలేకపోయింది. మణికా రివర్స్ స్పిన్ను సోఫియా పోల్కనోవా రెండో సెట్లో సమర్థవంతంగా అడ్డుకోగలిగారు. ఫలితంగా ఆ సెట్ను మణికా 2-11 తేడాతో కోల్పోయారు. ఇక ఏ దశలోనూ కోలుకోలేకపో్యారు. చివరి సెట్లో కాస్త కుదురుకున్నప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
మణికా కంటే ముందు ఇదే కేటగిరీలో భారత పెడ్లర్ సుతీర్థ ముఖర్జీ సైతం పరాజయాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. టేబుల్ టెన్నిస్ మహిళా సింగిల్స్ ఈవెంట్లో భాగంగా సోమవారం ఉదయం జరిగిన రౌండ్ 2 మ్యాచ్లో పోర్చుగల్కు చెందిన ఫూ యుతో సుతీర్ధ ముఖర్జీ తలపడింది. యూ ఫూ చేతిలో సుతీర్ధ 4-0 తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ ప్రారంభం నుంచి పోర్చుగల్ ప్లేయర్ దూకుడు ప్రదర్శించగా.. సుతీర్ధ కనీస ప్రతిఘటన ఇవ్వలేకపోయింది. ఒక్క గేమ్లో కూడా సుతీర్ధ ప్రభావం చూపకపోవడంతో మ్యాచ్ కేవలం 23 నిమిషాల్లోనే ముగిసింది. సింగిల్స్ ఈవెంట్లో సుతీర్ధ కథ ముగిసింది.