టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా సాగుతోన్న ఒలింపిక్ గేమ్స్ 2021.. క్రమంగా రసవత్తరంగా మారుతోన్నాయి. రెండోరోజు నిర్వహించే ఈవెంట్లన్నీ ఆసక్తితో కూడుకున్నవే. భారత్ ఖచ్చితంగా పతకం సాధిస్తుందని గంపెడాశలు పెట్టుకున్న ఈవెంట్స్ ఇవ్వాళ ప్రారంభం కానున్నాయి. ఇందులో మొదటిది- బ్యాడ్మింటన్. స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు.. తన రాకెట్తో ప్రత్యర్థులపై దాడి చేయబోయేది ఇవ్వాళే. హాకీ మ్యాచ్లో భారత్ బోణీ చేసింది. తన ప్రత్యర్థి న్యూజిలాండ్ను 3-2 గోల్స్ తేడాతో ఓడించింది.
ఈ పరిస్థితుల మధ్య మిక్స్డ్ అర్చరీలో భారత్ పతకం దిశగా మరో అడుగు ముందుకేసింది. మిక్స్డ్ అర్చరీ కేటగిరీలో చైనీస్ తైపేను ఓడించింది భారత్. ఈ విభాగంలో ఏస్ అర్చర్ దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ జంట..5-3 స్కోర్ తేడాతో చైనీస్ తైపేను మట్టి కరిపించింది. తొలిరోజు వ్యక్తిగత ర్యాంకింగ్ రౌండ్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయిన ప్రవీణ్ జాదవ్, టాప్-10లో నిలిచిన దీపికా కుమారి.. మిక్స్డ్ విభాగంలో అదరగొట్టారు.
చైనీస్ తైపే జంట లిన్, టాంగ్ జోడీని ఓడించారు. లిన్-టాంగ్ జోడీ తడబడిన ప్రతి సెట్లోనూ దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ చెలరేగిపోయారు. ఈ జంట దాదాపు అన్ని రౌండ్లలోనూ 10 పాయింట్లను సాధిస్తూ వచ్చింది. 3-3 సెట్లతో సమానంగా ఉన్న సమయంలో లిన్-7, టాంగ్-9 పాయింట్లను సాధించగా.. దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్ 10 పాయింట్లను సాధించారు. చివరి రెండో సెట్లలోనూ అదే తరహాలో దూకుడు కొనసాగింది.
Mixed recurve archery pair of @ImDeepikaK and @pravinarcher beats Chinese Taipei 5-3 and advances to Quarter Finals of #Tokyo2020. They will play their quarterfinal later today at 11:04 AM (IST)
— SAIMedia (@Media_SAI) July 24, 2021
Send in your wishes and #Cheer4India pic.twitter.com/hjycX1ZZFq
ఫలితాన్ని నిర్దేశించే చివరి సెట్లో లిన్-9, టాంగ్-9 పాయింట్లను సాధించగా.. దీపికా కుమారి-ప్రవీణ్ జాదవ్ 10 చొప్పున పాయింట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. దీనితో 5-3 తేడాతో భారత్ గెలిచింది. క్వార్టర్ ఫైనల్స్లో అడుగు పెట్టింది. భారత కాలమానం ప్రకారం.. క్వార్టర్ ఫైనల్ ఈ ఉదయం 11:30 గంటలకు ఆరంభమౌతుంది. ఇందులో కూడా దీపికా కుమారి-ప్రవీణ్ జాదవ్ జంట అదే దూకుడును కొనసాగించాల్సి ఉంటుంది. సెమీ ఫైనల్లో విజయం సాధించితే పతకం వశమైనట్టే.