టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021 కోసం వచ్చిన పోలండ్ స్విమ్మింగ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. క్వాలిఫయింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆరుగురు స్విమ్మర్లు స్వదేశానికి వెళ్లాల్సి వచ్చింది. 17 మంది స్విమ్మర్లు టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించగా.. పోలండ్ స్విమ్మింగ్ ఫెడరేషన్ (పీజడ్పీ) ఏకంగా 23 మందిని పంపింది. దీంతో అదనంగా వచ్చిన ఆరుగురిని పీజడ్పీ వెనక్కి పంపాల్సి వచ్చింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. అథ్లెట్లను అలా ఎలా పంపిస్తారు అని కూడా అభిమానులు, అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
India vs Sri Lanka: మూడో వన్డే మ్యాచ్కు వర్షం అంతరాయం.. భారత్ స్కోర్ 147/3!
ఫినా క్వాలిఫికేషన్ నిబంధనలు, ప్రపంచ స్విమ్మింగ్ బాడీ ప్రకారం అధికంగా పంపిన ఆరుగురు స్విమ్మర్లను పోలండ్ దేశం వెనక్కి పిలవాల్సి వచ్చింది. స్వదేశానికి వెళ్లిన వారిలో ఒలింపిక్స్లో రెండుసార్లు పాల్గొన్న అయిన అలిక్జా టికోర్జ్ కూడా ఉండడం గమనార్హం. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. 'ఒలింపిక్స్ కోసం ఎన్నో ఏళ్లు కష్టపడతాం. అన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఏమి జరిగిందో చూసి నేను చాలా షాక్కు గురయ్యాను. ఈ విధంగా నా జీవితంలో ఎప్పుడూ జరగలేదు. ఈ పీడకల నుంచి త్వరగా బయటపడాలని కోరుకుంటున్నా' అని అలిక్జా పేర్కొంది. మరోవైపు వెనక్కి వచ్చిన మిగతా స్విమ్మర్లు కూడా స్విమ్మింగ్ బాడీపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
జపాన్ రాజధాని టోక్యో ఆతిథ్యమిస్తున్న 32వ ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ కొద్దిసేపటి క్రితమే మొదలైంది. జపాన్ చక్రవర్తి నరుహిటో ఈ గేమ్స్ను ప్రారంభించారు. ప్రతిసారీ ఎంతో అంగరంగ వైభవంగా జరిగే వేడుకలను ఈసారి ప్రేక్షకులు లేకుండానే సింపుల్గా నిర్వహిస్తున్నారు. టీమ్స్ పరేడ్లో పాల్గొనే అథ్లెట్ల సంఖ్యను కూడా ఈసారి పరిమితం చేశారు. ఇందులో పాల్గొనే అన్ని దేశాల అథ్లెట్లు పరేడ్ నిర్వహించడం ఆనవాయితీ. ఈ పరేడ్లో ప్రాచీన, ఆధునిక ఒలింపిక్స్ జన్మస్థలమైన గ్రీస్ అందరి కంటే ముందు ఉంటుంది. ఈసారి కూడా గ్రీస్ తరఫున షూటింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్లో పాల్గొంటున్న అనా కొరకాకి, ఎలిఫ్తోరియోస్ పెట్రోనియాస్ తమ జాతీయ పతాకాన్ని పట్టుకొని ముందు నడిచారు.
జపాన్ భాష ప్రకారం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఒలింపిక్స్ టీమ్స్ పరేడ్లో పాల్గొన్నాయి. భారత్ తరఫున మొత్తం 19 మంది అథ్లెట్లు, ఆరుగురు అధికారులు ఈ పరేడ్లో పాలుపంచుకున్నారు. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన బాక్సర్ మేరీ కోమ్, హాకీ టీమ్ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ త్రివర్ణ పతాకంతో ముందు నడిచారు. ఎన్నడూలేని విధంగా ఈసారి 127 మంది అథ్లెట్ల బృందంతో భారత్ వెళ్లినా.. ఓపెనింగ్ సెర్మనీలో మాత్రం వారి సంఖ్య 19కే పరిమితమైంది.