టోక్యో: జపాన్ వేదికగా సాగుతోన్న రసవత్తరంగా సాగుతోన్న ఒలింపిక్స్లో అయిదో రోజు భారత్.. చేదు అనుభవాలను ఎదుర్కొంటోంది. అన్నీ అపజయాలే తగులుకుంటోన్నాయి.. ఒక్క హాకీలో తప్ప. తొలుత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ డబుల్స్ విభాగాన్ని విజయంతో ఆరంభించినప్పటికీ.. ఆ వెంటనే వరుస ఓటములను చవి చూసింది. ఈ ఈవెంట్ తొలి రౌండ్లో విజయం సాధించిన స్టార్ షూటర్లు మనుభాకర్/సౌరభ్ చౌదరీ జంట ఆ దూకుడును కొనసాగించలేకపోయింది. రెండో రౌండ్లో చతికిలపడింది. యశశ్విని డెస్వాల్/అభిషేక్ వర్మ పరిస్థితీ అంతే.
Shreyas Iyer: మాంఛి ఆకలి మీదున్నాడు: అతను క్రీజ్లో దిగాడంటే..: ట్రైనింగ్ షురూ
తాజాగా టేబుల్ టెన్నిస్లో ఓటమి బారిన పడింది. పురుషుల టేబుల్ టెన్నిస్ కేటగిరీలో భారత పెడ్లర్ ఆచంట శరత్ కమల్ ఓడిపోయాడు. మూడో రౌండ్లో అతను చైనాకు చెందిన మా లాంగ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. వెటరన్ శరత్ కమల్కు ఇది నాలుగో ఒలింపిక్స్. వరుసగా నాలుగు ఒలింపిక్స్లో అతను పాల్గొన్నాడు. పతకాలను మాత్రం అందుకోలేకపోయాడు. ఈ సారి అతనిపై భారీగా అంచనాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా అతని ప్రదర్శన కూడా సాగింది. తొలి, మలి రౌండ్లల్లో అద్భుతంగా ఆడాడు. మూడో రౌండ్లో చైనా ప్రత్యర్థిని ధీటుగా ఢీ కొట్టలేకపోయాడు.
మా లాంగ్ చేతిలో 11-7, 8-11, 13-11, 11-4, 11-4 సెట్ల తేడాతో మ్యాచ్ను కోల్పోయాడు. తొలి సెట్ను కోల్పోయిన తరువాత.. శరత్ కమల్ అనూహ్యంగా రాణించాడు. రెండో రౌండ్లో దమ్ము చూపాడు. రెండో సెట్పై పూర్తి ఆధిపత్యాన్ని కనపర్చాడు. చైనా పెడ్లర్ను ఎనిమిది పాయింట్లకే పరిమితం చేశాడు. 11-8 తేడాతో ఆ సెట్ను గెలుచుకున్నాడు. మూడో సెట్లోనూ ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. టైబ్రేకర్ వరకూ వెళ్లిందీ సెట్. కీలకమైన సమయంలో మా లాంగ్ విజృంభించడంతో ఆ సెట్ను 13-11 తేడాతో కోల్పోయాడు. ఆచంట ఎనర్జీ అక్కడితో ఆవిరయినట్టు కనిపించింది.
ఆ తరువాతి రెండు సెట్లలో పెద్దగా ప్రతిఘటించలేకపోయాడు. తేలిగ్గా లొంగిపోయాడు. 11-4, 11-4 పాయింట్లతో మా లాంగ్ చివరి రెండు సెట్లను సులువుగా గెలుచుకున్నాడు. ఈ ఓటమితో టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత పోరు పూర్తిగా ముగిసిపోయింది. మహిళా పెడ్లర్లు ఇఫ్పటికే సింగిల్స్ , మిక్స్డ్ డబుల్స్ నుంచి వైదొలిగారు. సుతీర్థ ముఖర్జీ, మణికా బాత్రా నాలుగో రోజే ఓటమి చవి చూశారు. అనుభవజ్ఞుడైన శరత్ కమల్ ఇంకా మిగిలే ఉండటంతో కనీసం క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్లడానికి అవకాశం ఉండొచ్చనే అంచనాలు వెలువడ్డాయి. వాటిని తలకిందులు చేశాడు శరత్.