
హైదరాబాద్: 2020లో జరగనున్న ఒలింపిక్స్కు జపాన్ రాజధాని టోక్యో ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఒలింపిక్స్ మస్కట్లకు సంబంధించిన పేర్లను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ మస్కట్ల పేర్లను 'మిరాయ్తోవా', 'సోమైటీ'గా నామకరణం చేశారు.
పొడవాటి చెవులతో నీలి రంగులో ఉన్న ఒలింపిక్స్ మస్కట్ పేరుని మిరాయ్తోవాగా పెట్టగా, గులాబీ రంగులో ఉన్న పారాలింపిక్స్ మస్కట్ పేరేమో సోమైటీగా నిర్వాహకులు ప్రకటించారు. నిజానికి ఈ మస్కట్లను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రపంచానికి పరిచయం చేసినప్పటికీ పేర్లు మాత్రం అప్పుడు ప్రకటించలేదు.
దీంతో ఆదివారం మస్కట్ పేర్లను అధికారికంగా ఒలింపిక్స్ ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. జపాన్ భాషలో మిరాయ్ అంటే భవిష్యత్, తోవా అంటే శాశ్వతం. అలాగే పారాలింపిక్స్ మస్కట్ సోమైటీ అనే పేరును వికసించే చెర్రీ పుష్పం.. సోమియోషినో అనే పదం నుంచి నుంచి తీసుకున్నారు.
అనంతరం జపాన్లోని టోక్యో ఓడైబా మెరైన్ పార్క్లో ఆదివారం మస్కట్లు హడావుడి చేశాయి. వచ్చే ఒలింపిక్ కోసం సోగకళ్ల మస్కట్లను సిద్ధం చేసిన నిర్వాహకులు, వాటి రూపాలను తొలిసారి ప్రపంచానికి విడుదల చేశారు. టంగ్ ట్విస్టింగ్ చాలెంజ్లో భాగంగా సూపర్ హీరోల పేర్లను టోక్యో 2020 ఒలింపిక్స్ అధ్యక్షుడు, జపాన్ మాజీ ప్రధాని యోషిరో మోరి ప్రకటించడం విశేషం.
టోక్యో ఒలింపిక్స్ 2020 జులై 24న ఆరంభమై.. ఆగస్టు 9వరకు జరగనున్నాయి. పారాలింపిక్స్ ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 6 మధ్య నిర్వహించనున్నారు.