కోల్కతా: షారూక్ ఖాన్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్కు బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా షాకిచ్చారు. సునీల్ నరైన్ బౌలింగు శైలికి ఐసీసి నుండి అనుమతి లభించినప్పటికీ.. అతడు చెన్నైలో మరోసారి పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని దాల్మియా చెప్పారు.
తాను కోల్కతా నైట్ రైడర్స్ మేనేజ్మెంట్తో మాట్లాడానని, ఒకటి రెండుసార్లు అతడు పరీక్షళకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పానని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేస్తున్నాడనే కారణంతో 2014 ఛాంపియన్స్ లీగ్ సందర్భంగా నరైన్ పైన నిషేధం విధించారు.
ఆ తర్వాత పరీక్షల అనంతరం నరైన్కు ఐసీసీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఐసీసీ నివేదికను బీసీసీఐ సమ్మతించడం లేదు. మరోవైపు, కోల్కతా నైట్ రైడర్స్ ఈ విషయంపై ఘాటుగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తోంది.
శ్రీనివాసన్ పైన ముస్తఫా ఘాటు వ్యాఖ్యలు
ఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ముస్తఫా కమాల్ ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, ముస్తఫా కమాల్ రాజీనామాను ఐసీసీ ఆమోదించింది. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు ముస్తఫా తన లేఖలో పేర్కొన్నట్టు ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ ఒక ప్రకటనలో తెలిపాడు.
ఎవరిపైనా తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని ముస్తఫా తన లేఖలో పేర్కొన్నట్టు చెప్పాడు. అదే విధంగా తన వద్ద జరిగిన పొరపాట్లకు అందరినీ క్షమాపణ కూడా కోరాడన్నాడు. ముస్తఫా ఢాకాలో చెప్పిన అంశాలకూ, రిచర్డ్సన్ ప్రకటనకు ఎలాంటి సంబంధం లేకపోవడం గమనార్హం. ఐసీసీ సమావేశం ఈ నెల 15, 16 తేదీల్లో జరుగుతుంది. కొత్త అధ్యక్షుడి ఎన్నికపై ఆ సమావేశంలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కాగా, రాజీనామా చేసే సమయంలో ముస్తఫా చైర్మన్ శ్రీనివాసన్ పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మండలి నిబంధనావళికి అనుగుణంగానే మాత్రమే తాను పని చేయగలుగుతానని, ప్రస్తుత కార్యవర్గం దానిని ఉల్లంఘిస్తున్నదని ఆరోపించారు. తాను కేవలం రాజీనామా పత్రాన్ని పంపడం లేదని అతను స్పష్టం చేశాడు. రాజ్యాంగ ఉల్లంఘనకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తేల్చిచెప్పానన్నాడు.
ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్షిప్ ట్రోఫీని విజేత జట్టుకు ఐసిసి అధ్యక్షుడు ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. వరల్డ్ కప్ ట్రోఫీని అందచేసే హక్కు తన నుంచి శ్రీనివాసన్ లాక్కున్నాడని ఆరోపించాడు. ఇది చాలా అవమానకరమని అన్నాడు.
ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ కుళ్లిపోయాడని ముస్తఫా ఘాటుగా విమర్శించాడు. అతను కుళ్లు రాజకీయం చేస్తున్నాడని ఆరోపించాడు. కాలం చెల్లిన విధానాలతో అతను ఒంటెద్దు పోకడలను అనుసరిస్తున్నాడన్నాడు. ఇలాంటి వ్యక్తుల వల్ల క్రికెట్కు నష్టం వాటిల్లుతుందన్నాడు. ఐసీసీ సభ్య దేశాలు వెంటనే స్పందించకపోతే పరిస్థితి చేయ దాటే ప్రమాదం ఉందన్నాడు.
శ్రీనివాసన్ ఓ తుచ్చుడు, వివాదాస్పదుడన్నారు. ఇక ఐసీసీని ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ అని పిలవాలన్నాడు. శ్రీనివాసన్ పేరు ఉచ్చరించేందుకే తన మనసు అంగీకరించట్లేదన్నాడు. నేను ఎందుకు రాజీనామా చేశానో అర్థం చేసుకోవాలన్నాడు. బంగ్లాదేశ్ - భారత్ మ్యాచ్ నేపథ్యంలో.. అంపైర్ల పైన తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని ఆదేశించారని అన్నారు.