భారత రెజ్లింగ్ సమాఖ్యపై షాకింగ్ కామెంట్స్ చేసిన కొందరు రెజ్లర్లు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. స్టార్ మహిళా రెజ్లర్లు కూడా అమ్మాయిలను కొందరు కోచ్లు వేధించే వారంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారతీయ రెజ్లర్లు అందరూ దీక్షకు దిగారు. రెజ్లింగ్ సమాఖ్యకు వ్యతిరేకంగా నిరసన చేయడం ప్రారంభించారు. దీనికోసం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ను వేదికగా ఎంచుకున్నారు.
జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు అందరూ బైఠాయించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. రెజ్లింగ్ సమాఖ్యలో సదరు రెజ్లర్లు ఎదుర్కొన్న సమస్యలు తెలుసుకొని, పరిష్కార మార్గాలు సూచించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రంగంలోకి దిగారు. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం నిరసనలో పాల్గొన్న కొందరు స్టార్ రెజ్లర్లతో చర్చలు జరపాలని నిర్ణయించింది.
అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో ఒక బృందం ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. రెజ్లర్ల సమస్యను తెలుసుకొని, చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే స్టార్ రెజ్లర్లు భజరంగ్ పునియా, వినేష్ ఫోగట్, సంగీత ఫోగట్, సాక్షి మాలిక్ తదితరులను ఈ సమావేశానికి రావలసిందిగా ఈ కమిటీ కోరింది. ఈ విషయాన్ని భజరంగ్ పూనియా తదితరులు ధ్రువీకరించారు. ఈ సమావేశంలో సాధ్యమైనంత త్వరగా పాలు పంచుకోవాలని ప్రభుత్వం నుంచి తమకు పిలుపు వచ్చిందని చెప్పారు.
అయితే తమ డిమాండ్ విషయంలో మాత్రం వెనక్కు తగ్గే ప్రసక్తి లేదని భజరంగ్ పూనియా స్పష్టం చేశాడు. డబ్ల్యూఎఫ్ఐ (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ప్రెసిడెంట్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టాడు. 'డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు రాజీనామాతోపాటు ఈ సంస్థను బ్యాన్ చేయాలనే మా డిమాండ్ను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు. దీనిపై ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుందీ వెల్లడిస్తాం' అని భజరంగ్ వివరించాడు.