సిడ్నీ: మార్చి 26వ తేదీన భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్లో స్పిన్ కీలకం కాదని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్కనర్ సోమవారం అన్నాడు. శ్రీలంక - సౌతాఫ్రికా మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్లో లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్, ఆఫ్ స్పిన్నర్ జైపీ డుమినీలు ఏడు వికెట్లు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో.. ఫాల్కనర్ మాట్లాడుతూ.. స్పిన్ తమకు అంత సమస్య కాదని చెప్పాడు.
రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడెజాలు వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ అని, వారి పని వారు చేస్తున్నారని చెప్పాడు. గెలిచేందుకు తమ కృషి తాము చేస్తామని చెప్పారు. ప్రపంచ కప్లో భారత్ వరుస గెలుపులతో దూసుకుపోతున్న విషయమై స్పందిస్తూ.. ఇది తనకు ఆశ్చర్యమేమీ కలిగించడం లేదన్నాడు.
అయితే, వారి వరుస విజయాల వెనుక కారణం తనకు తెలియదని చెప్పాడు. తాను వారితో లేనని, అలాగే వారికి ట్రెయినింగ్ ఏమీ ఇవ్వడం లేదని, కాబట్టి కారణం తనకు తెలియదని చెప్పాడు. అయితే, విదేశీ టూర్లో చాలాకాలం నుండి ఉండటం మాత్రం భారత్కు కలిసి వచ్చే విషయమేనని చెప్పాడు.
భారత్ మెరుగైన టీం అని, ఆస్ట్రేలియా కూడా మెరుగైన జట్టని చెప్పాడు. ఇది చాలా ఉత్కంఠ పోరు అని చెప్పాడు. భారత అభిమానులు ఆ జట్టుకు మద్దతివ్వడం సహజమే అన్నాడు. క్వార్టర్ ఫైనల్లో భారత్ పైన తాము గెలిస్తామనే ధీమా వ్యక్తం చేశాడు. రెండు రోజుల్లోనే రెండు కీలక ఆటలు చూడబోతున్నారని చెప్పాడు.
అవసరమైతే స్పిన్ భారాన్ని తాను మోస్తానని ప్రధాన స్పిన్నర్గా రాణిస్తానని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ అన్నాడు. ఈ టోర్నీలో తనస్పిన్తో రెండు వికెట్లు పడగొట్టానని, కెప్టెన్ క్లార్క్ ఎప్పుడు తన చేతికి బంతి ఇచ్చినా సద్వినియోగం చేసుకుంటానని చెప్పాడు.
ఆస్ట్రేలియా స్పిన్ బౌలింగ్ కోచ్ డావిసన్తో తన బౌలింగు గురించి కొన్ని విషయాలు మాట్లాడానని చెప్పారు. ప్రధాన స్పిన్నర్ స్థాయిలో పరుగులు కట్టడి చేయడమే కాకుండా వికెట్లు తీయగలనని చెప్పాడు. కాగా, స్పిన్కు అనుకూలించే సిడ్నీ పిచ్ పైన భారత్ను ఎదుర్కొనే విషయమై ఆస్ట్రేలియా ప్రణాళికలు రచిస్తోంది.
సిడ్నీ పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉండే పిచ్. అయితే, ప్రధాన స్పిన్నర్లు లేక ఆస్ట్రేలియా భారత్ను ఎదుర్కొనే ప్రణాళికలు రచిస్తోంది. ఆస్ట్రేలియా బలం పేస్ బౌలింగ్. కానీ సిడ్నీ పిచ్ స్పిన్కు అనుకూలం కాబట్టి ఆస్ట్రేలియా స్పిన్ గురించి ఆలోచిస్తోంది.