టోక్యో: కరోనా వైరస్తో టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఓ సారి వాయిదా పడ్డ ఈ సమ్మర్ గేమ్స్ ఈ ఏడాది కూడా జరగడం కష్టంగానే కనిపిస్తోంది.
జపాన్ ప్రజలంతా ఒలింపిక్స్ను బహిష్కరించాలని కోరుతుండగా.. ప్రభుత్వం మాత్రం మొండిపట్టుదలతో ముందుకు సాగుతున్నది. తాజాగా స్టార్ ఆటగాళ్లు సైతం ఈ ప్రతిష్టాత్మక గేమ్స్ నిర్వహించడంపై పెదవి విరుస్తున్నారు.
టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్, నవోమి ఒసాకా, జపాన్కు చెందిన కెయి నిషికోరి ప్రతిష్ఠాత్మక ఒలింపిక్ టోర్నమెంట్ గురించి ప్రశ్నలు సంధించారు. ఈ టోర్నమెంట్లో దాదాపు 10,000 మంది అథ్లెట్లు, సిబ్బంది హాజరవుతారని, వీరందరికీ బయో బబుల్ నిర్వహణ సాధ్యమవుతుందా? అని నిర్వాహకులను నిలదీస్తున్నారు.
జపాన్లో గత 10 రోజుల్లో 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, స్థానిక నిర్వాహకులు ఈ టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహిస్తారనే నమ్మకం తనకు లేదని జపాన్కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు నిషికోరి అన్నారు. ఇది వేలాది మంది ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందని, జపాన్లోని అనేక నగరాలు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. ఒలింపిక్స్ నిర్వహించడం సరైనదేనా అనే ప్రశ్న కూడా నిషికోరి లేవనెత్తారు.
కాగా, తన కుమార్తెను వెంట తీసుకురావడానికి సెరెనా విలియమ్స్ అనుమతి కోరక ముందే నిర్వాహకుల తీరును తీవ్రంగా ప్రశ్నించింది. తన మూడేళ్ల కుమార్తెను తీసుకెళ్లడానికి అనుమతించకపోతే టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనేది లేదని సెరెనా కరాఖండిగా తెలిపింది. 'నా కుమార్తె లేకుండా నేను ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా గడపలేదు. ఈ సమయంలో కుమార్తెను ఒంటరిగా వదిలి రావాలంటే చాలా కష్టం. అయినా కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో బయో బబుల్ ఎలా నిర్వహిస్తారు' అని ఆమె ప్రశ్నించారు.
ఇక ఓ అథ్లెట్గా ఖచ్చితంగా ఒలింపిక్ నిర్వహించాలంటానని, కానీ జపాన్ పరిస్థితి మరింతగా దిగజారిపోతున్న సమయంలో ఒలింపిక్స్ జరగాలని మాత్రం కోరుకోనని ఒసాకా తెలిపింది. ఇక ఒలింపిక్స్ రద్దు చేయాలని 60 శాతం మంది జపాన్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.