హైదరాబాద్: క్రీడా మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ టీమిండియా సీనియర్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ను కలిశారు. ఏదో ఆటగాళ్ల కోసమో.. క్రీడా అభివృద్ధికో కలవలేదు. ఎన్డీఏ సర్కారు సాధించిన విజయాలను గురించి చెప్పే నిమిత్తం సెహ్వాగ్తో ముచ్చటించారు. 'సంపర్క్ ఫర్ సమర్ధన్' కార్యక్రమంలో భాగంగా దేశంలోని వివిధ రంగాల ప్రముఖులను కలిసి తాము సాధించిన విజయాలను వివరిస్తుంది ఎన్డీఏ సర్కారు.
ఇందులో భాగంగా దేశరాజధాని ఢిల్లీలోని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ నివాసానికి కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాథోడ్, బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ గురువారం వెళ్లారు. గత నాలుగేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలతో రూపొందించిన పుస్తకాన్ని వీరిద్దరూ సెహ్వాగ్కు అందజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
తిరుగు ప్రయాణంలో రాథోడ్, తివారీ ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణికులతో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. రోడ్లన్నీ నీటమునగడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మరో వైపు మీడియా సమావేశంలో పాల్గొన్న రాజ్యవర్థన్ సింగ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) పేరు మారనున్నదని వెల్లడించారు. ఈ విషయం గురించి అధికారికంగా సాయ్కు ఇప్పటి వరకు ఎటువంటి పేరును పెట్టలేదు. కానీ ప్రస్తుతానికి దాన్ని స్పోర్ట్స్ ఇండియాగా పిలవాలని భావిస్తున్నారు. ఇంకా.. క్రీడా విధానాన్ని మరింత సరళం చేయనున్నట్లు ఆయన తెలిపారు. కొన్ని క్రీడా పోస్టులను కూడా తొలిగిస్తున్నట్లు ఆయన చెప్పారు. అథ్లెట్లకు ఇచ్చే రోజువారీ ఆహార ఖర్చులను పెంచినట్లు మంత్రి తెలిపారు. ఒలింపిక్ పతక విజేతలకు గ్రేడ్ ఏ ఉద్యోగాలు ఇప్పించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.