మాధవన్ తన ఇనిస్టాగ్రామ్లో
ఈ విషయాన్ని మాధవన్ తన ఇనిస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా "ఆసియా గేమ్స్లో ఇండియా రజత పతకం సాధించింది. దేవుడి ఆశీస్సులతో... భారత్ తరుపున వేదాంత్ తన మొట్టమొదటి పతకాన్ని సాధించాడు" అంటూ కామెంట్ పెట్టాడు.
వేదాంత్ వయసు 14 ఏళ్లు
ప్రస్తుతం వేదాంత్ వయసు 14 ఏళ్లు. స్విమ్మింగ్ అతడికి ప్రాణం. స్విమ్మింగ్లో ఇప్పటికే పలు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. అంతకముందు కూడా మాధవన్ తన కుమారుడు సాధించిన పతకాల గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.
భారత్కు రజత పతకం
భారత్కు రజత పతకం అందించిన వారిలో వేదాంత్తో పాటు అతడి టీమ్లో ఉత్కర్ష్ పాటిల్, సాహిల్ లాస్కర్ మరియు షోన్ గంగూలీలు ఉన్నారు. గ్రూప్ IIలో 4x100మీటర్ల ఫ్రీ స్టైల్ రిలేలో థాయిలాండ్ స్విమ్మర్లు స్వర్ణ పతకం సాధించగా... జపాన్ స్విమ్మర్లు కాంస్య పతకం సాధించారు.
గతేడాది థాయిలాండ్లో
ఇదిలా ఉంటే, గ్రూప్ Iలో 4x100మీటర్ల ఫ్రీ స్టైల్ రిలేలో భారత స్విమ్మర్లు స్వర్ణ పతకం సాధించారు. కాగా, గతేడాది థాయిలాండ్లో జరిగిన అంతర్జాతీయ స్విమ్మింగ్ మీట్లో భారత్ తరుపున ప్రాతినిథ్యం వహించి కాంస్య పతకం సాధించాడు. మరోవైపు వేదాంత్ తండ్రి మాధవన్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నాడు.