గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్లిఫ్టింగ్ పురుషుల 77 కిలోల విభాగంలో సతీష్ శివలింగం భారత్కు స్వర్ణ పతకాన్ని అందించాడు. ఈ క్రమంలో అతను కామన్వెల్త్ గేమ్స్లో కొత్త రికార్డును నెలకొల్పాడు. రవి కటులు రజత పతకాన్ని సాధించడంతో మొదటి రెండు స్థానాలను భారత్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రాన్కొస్ ఎటౌండీ కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. గత ఏడాది కామన్వెల్త్ చాంపియన్షిప్స్లో స్వర్ణ పతకాన్ని సాధించిన సతీష్ కెరీర్లో మొదటిసారి కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొని, స్వర్ణంతో సత్తా చాటాడు.
సతీష్ మొత్తం 314 కిలోల బరువునెత్తి అగ్రస్థానాన్ని ఆక్రమించడమేగాక, కామన్వెల్త్ గేమ్స్ రికార్డును కూడా నెలకొల్పాడు. కాగా, 2010 కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత రవి 317 కిలోల బరువునెత్తి రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఎటౌండీ 314 కేజీల బరువుతో మూడో స్థానాన్ని ఆక్రమించాడు.
ఇది ఇలా ఉండగా తమిళనాడు ప్రభుత్వం స్వర్ణం సాధించిన సతీష్ శివలింగంకు రూ. 50లక్షల నజరానా ప్రకటించింది.
కాగా, భారత్కు వెయిట్లిఫ్టింగ్లో ఇప్పటి వరకూ తొమ్మిది పతకాలు దక్కాయి. వీటిలో మూడు స్వర్ణం కాగా, రెండు రజతం, నాలుగు కాంస్య పతకాలున్నాయి. 2010లో భారత్ అత్యుత్తమంగా రెండు స్వర్ణం, మరో రెండు రజతం, నాలుగు కాంస్యాలతో ఎనిమిది పతకాలను గెల్చుకుంది. కామన్వెల్త్ గేమ్స్లో అదే అత్యుత్తమ ప్రదర్శన కాగా, ఇప్పుడు ఆ రికార్డును అధిగమించింది.
షూటింగ్:
కామన్వెల్త్ గేమ్స్లో షూటింగ్ పోటీలకు కేంద్రమైన బారీ బడాన్ సెంటర్లో భారత్ హవా కొనసాగుతున్నది. సోమవారం నాటి పురుషుల 50 మీటర్ల పిస్టోల్ ఈవెంట్లో 'పిస్టోల్ కింగ్' జీతూ రాయ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, గుర్పాల్ సింగ్ కాంస్య పతకాన్ని అందుకున్నాడు. మొదటి రెండు స్థానాలు భారత్కే దక్కగా, ఆస్ట్రేలియాకు చెందిన డానియల్ రెపచొలీకు కాంస్య పతకం లభించింది.
పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో గగన్ నారంగ్కు రజత పతకం లభించింది. 2006, 2010 కామన్వెల్త్ గేమ్స్లో నాలుగేసి పతకాలను సాధించిన అతను సోమవారం 0.7 పాయింట్ల తేడాతో స్వర్ణ పతకాన్ని కోల్పోయి, రజతంతో సంతృప్తి చెందాడు. ఆస్ట్రేలియాకు చెందిన వారెన్ పొటెంట్ 204.3 పాయింట్లు సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ షూటర్ కెనెత్ పార్స్కు కాంస్య పతకం లభించింది.
బాక్సింగ్:
పురుషుల బాక్సింగ్ 81 కిలోల విభాగంలో సుమీత్ సంగ్వాన్, 64 కిలోల విభాగంలో మనోజ్ కుమార్, 49 కిలోల విభాగంలో దేవేంద్రో సింగ్, 75 కిలోల విభాగం లో విజేందర్ సింగ్ క్వార్టర్ ఫైనల్స్లోకి అడుగుపెట్టారు. గ్రూప్ 16లో మహమ్మద్ హకిమూ ఫ్యూమూను సుమీత్ 3-0 తేడాతో ఓడించగా, ఆర్థర్ బియార్స్లానొవ్పై మనోజ్ 2-1 తేడాతో విజయం సాధించాడు.
దేవేంద్రో 2-1 తేడాతో శ్రీలంకకు చెందిన మదుషన్ గామగేపై గెలుపొందాడు. విజేందర్ 3-0 తేడాతో నమీబియాకు చెందిన ముజాన్జవో కసుతోను ఓడించాడు. అయితే, పతకాన్ని సాధిస్తాడనుకున్న శివ్ థాపా 56 కిలోల విభాగంలో నిరాశ పరిచాడు. మైఖేల్ కాంటన్ చేతిలో అతను ఓటమిపాలై నిష్క్రమించాడు.