న్యూఢిల్లీ: కొరియాలో వచ్చే వారంలో జరగనున్న వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్కు భారత్ తరుపున పాల్గొనబోతున్న ఎనిమిది మంది మహిళా బాక్సర్లకు ప్రెగ్నన్సీ టెస్టులను జరిపినట్లు అంగీకరించింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్).
కొరియాలోని జిజూ ఐస్లాండ్స్లో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ జరగనుంది. ఈ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు ఎనిమిది మంది మహిళా బాక్సర్లు సన్నద్ధమవుతున్నారు. వీరికి ప్రగ్నెన్సీ టెస్టులు చేయాలని బాక్సింగ్ ఇండియా సాయ్ను కోరిందట.
దీంతో సాయ్ తన వైద్యులతో మహిళా బాక్సర్లకు టెస్టులు నిర్వహించింది. అంతర్జాతీయ బాక్సింగ్ అసోషియేషన్ నిబంధనల ప్రకారం ప్రగ్నెన్సీ టెస్టులు నిర్వహించామని సాయ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధీర్ సేతియా తెలిపారు. ఇలాంటి పరీక్షలు నిర్వహించడం మొదటి సారి కాదని, గతంలో కూడా విదేశాల్లో జరిగే ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే భారత మహిళా బాక్సర్లకు టెస్టులు నిర్వహించామని తెలిపారు.
వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనాలనే దృఢ సంకల్పంతో ఉన్న సదరు మహిళా బాక్సర్లు కష్టమనిపించినా, నోరెత్తకుండా టెస్టులకు హాజరయ్యారని సాయ్ వైద్య సలహాదారు సీఎస్ఎం చంద్రన్ వెల్లడించారు.
ఐతే అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ ప్రగ్నెన్సీ టెస్టులు చేయాలని ఎక్కడా చెప్పలేదని కూడా చంద్రన్ పేర్కొన్నారు.
సాధారణ వైద్య పరీక్షలు చేయించుకుని నో ప్రెగ్నెన్సీ సర్టిఫికెట్ను క్రీడాకారులు సొంత డిక్లరేషన్తో సమర్పిస్తే సరిపోతుంది. అదే, 18 ఏళ్ల లోపు బాలికలైతే వారి తల్లిదండ్రులు డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. ఈ
టెస్టులకు హాజరైన వారిలో వివాహితులతో పాటు అవివాహిత యువతులు ఉన్నట్లు సమాచారం.
మహిళల పట్ల జరుగుతున్న ఇలాంటి చర్యలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ అలాగే జాతీయ మహిళల కమిషన్లు జోక్య చేసుకోవాల్సిన తరుణం వచ్చిందని అన్నారు. ఇలాంటి చర్యల వల్ల క్రీడల పట్ల ఆసక్తి చూపే మహిళలు కూడా ఆలోచన ధోరణిలో మార్పులు తలెత్తే విధంగా ఉందని క్రీడా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.