కోల్కతా: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నేతృత్వంలో మలబార్కు ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళ బ్లాక్బస్టర్స్ తాజాగా ఇంగ్లాండ్ ఇంటర్నేషనల్, మాంచెస్టర్ స్టీవ్కొప్పెల్ కోచ్ ఆధ్వర్యంలో శుభారంభాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తున్నది. అందుకు అనుగుణంగానే కొత్తగా అనుభవజ్ఞులైన విదేశీ క్రీడాకారులను తనలో చేర్చుకున్నది. గత రెండు సీజన్ల నిరాశాజనక ఫలితాలను పక్కనబెట్టాలని నిర్ణయించుకున్నది.
కోచ్ స్టీవ్తోపాటు కేరళ బ్లాక్బస్టర్స్ సారధి ఆరోన్ హుగెస్ సైతం 36 ఏళ్లుగా ఫుట్బాల్ ఆడుతున్న వెటరన్ ఆటగాడు. ఇంగ్లండ్ ప్రీమియర్ లీగ్ క్లబ్ల తరఫున ప్రాతినిధ్యం వహించిన హుగెస్.. ఇటీవల నార్త్రన్ ఐర్లాండ్ యూరో - 2016 జట్టులో సభ్యుడిగా ఉక్రెయిన్, జర్మనీలను గ్రూప్ దశలోనే ఇంటికి పంపడంలోనూ, ప్రీ క్వార్టర్స్ఫైనల్స్లో వేల్స్ను పోటీ నుంచే తప్పించడంలోనూ కీలక పాత్ర పోషించాడు.
ఇంగ్లిష్ వింగర్ అంటోనియో జెర్మన్, స్పానిష్ మిడ్ ఫీల్డర్ కుర్రాయిస్ ప్రీటోలు గత సీజన్లో మంచి ఆట తీరు ప్రదర్శించారు. వీరితోపాటు హుగెస్, డిఫెండర్ కెడ్రిక్ హెంగ్బార్ట్, గోల్కీపర్ గ్రహం స్టాక్, అజ్రక్ మహమాత్, డకెన్స్ నాజోన్, కెర్విన్ బెల్ఫర్ట్, డిడియర్ బోరిస్ కాడియో తదితరులతో కేరళ బ్లాక్బస్టర్స్ జట్టు పటిష్ఠ స్థితిలో ఉంది.
మిడ్ ఫీల్డర్ మహ్మద్ రఫీఖ్తోపాటు గతేడాది ఉత్తమ ప్రదర్శన గావించిన జోస్ ఆడనుండడం కలిసి వచ్చే అంశమే. కేరళకు థోంగ్ఖోసీం హావోకిప్ ఈ దఫా ట్రంప్కార్డుగా మారనున్నాడు.
కోచ్గా బాధ్యతలు స్వీకరించిన స్టీవ్ కొప్పెల్.. నిశితంగా జట్టు పరిస్థితిని అధ్యయనంచేసి.. తనదైన శైలిలో డిఫెన్స్ ఆటతీరుపై వారికి తర్ఫీదునిచ్చాడు. వచ్చేనెల ఒకటో తేదీన ఐఎస్ఎల్ ప్రారంభోత్సవం నాడే నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి జట్టుతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ జట్టు తలపడేందుకు సన్నద్ధమవుతున్నది.
కోల్కతా ఫుట్బాల్ క్లబ్తో మ్యాచ్ డ్రా
కేరళ బ్లాక్ బస్టర్స్ (కెబిబి) ఎఫ్సి జట్టు మూడో సీజన్ ఐఎస్ఎల్కు ముందు ప్రీ సీజన్ మ్యాచ్ల్లో అజేయంగా సాగుతోంది. కోల్కతాలో ప్రాక్టీస్లో కెబిబి ఎఫ్సి, అట్లెంటికో డీ కోల్కతా పాల్గొంటున్నాయి.
నూతన కోచ్ స్టీవ్ సారధ్యంలో థాయిలాండ్లో తొలిదశ ప్రీ సీజన్ శిక్షణను ముగించుకుని కేరళకు వచ్చిన యెల్లోస్ అండ్ బ్లూస్ తాజాగా కోల్కతాలో శిక్షణ పొందుతున్నారు. కలకత్తా ఫుట్బాల్ లీగ్ (సిఎఫ్ఎల్) జట్టుతో జరిగిన మ్యాచ్ 1 - 1 స్కోర్తో డ్రాగా ముగిసింది.
15వ నిమిషంలో కోల్కతా గోల్చేయడంతో కేరళ బ్లాక్బస్టర్స్ ఆత్మరక్షణలో పడింది. కానీ 20వ నిమిషంలో కెర్విన్స్బెల్ఫోర్ట్ సహకారంతో ఫరూఖ్ చౌదరి గోల్చేయడంతో స్కోర్ సమమైంది. తర్వాత ఇరు పక్షాలు లీడ్ సాధించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.