హైదరాబాద్: భారత చెస్ స్టార్ క్రీడాకారిణి సౌమ్య స్వామినాథన్ ఇరాన్ టోర్నమెంట్ నుంచి స్వయంగా తప్పుకుంది. అక్కడ ఆడాలంటే ఆ దేశ పద్ధతులను గౌరవించాల్సిందేనన్న నిబంధన నచ్చకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అక్కడి సంప్రదాయం ప్రకారం.. మహిళలు తల వరకూ ముసుగు ధరించి టోర్నమెంట్లో పాల్గొనాలి. ఈ విషయాన్ని ఆమె తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
'జులై 26నుంచి ఆగష్టు 4 వరకూ జరగాల్సి ఉన్న ఆసియన్ నేషన్స్ కప్ చెస్ ఛాంపియన్షిప్ 2018లో జాతీయ జట్టు తరపున అర్హత సాధించాను. కానీ, ఇందులో ఆడాలంటే ఖచ్చితంగా తలవరకు ముసుగుగానీ, లేదా బుర్ఖా గానీ ధరించాల్సిందేనని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. భారతదేశ పౌరురాలిగా, వ్యక్తిగతంగా నా హక్కులకు భంగం కలిగేలా ఇరాన్ సంప్రదాయం పాటించాల్సిందేనన్న నిబంధనను ఒప్పుకోలేకపోయాను. ఈ తరుణంలో నాకు కనిపించిన ఒకే ఒక్క దారి పోటీ నుంచి నిష్క్రమించడం.'
'నేను చాలా నిరుత్సాహానికి గురైయ్యాను. ఇలాంటి అఫీషియల్ ఛాంపియన్షిప్లలో పాల్గొనేముందు జాతీయ జట్టు యూనిఫామ్లు అటువంటివి వాడితే బాగుంటుంది. ఆర్గనైజర్లు కూడా ఇదే కోరుకుంటారు. కానీ, ఇలా మత సంబంధిత నియమాలు పాటించి క్రీడాకారులకు ఆటంకం కలిగించడం సమంజసం కాదు. ఇలా క్రీడాకారులు ఎన్నో సందర్భాల్లో సర్దుకుపోతూనే ఈవెంట్లలో పాల్గొంటున్నారు'
'భారత దేశం తరపున ఆడేందుకు జాతీయ జట్టులో సెలక్ట్ అయినందుకు చాలా గౌరవంగా భావిస్తున్నా. కానీ, ఇలాంటి కారణాలతో నేను దూరమవ్వాల్సి వస్తుంది. ఈ విషయంపై అభిమానులను నా క్షమాపణలు కోరుతున్నా.' అంటూ ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
2016వ సంవత్సరంలో జరిగిన ఏషియన్ ఎయిర్గన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొనాల్సిన హీనా సిద్ధూ కూడా ఇదే కారణంతో టోర్నీ నుంచి వైదొలిగింది.