హైదరాబాద్: భారత్లో చెస్ రంగం దినదినాభివృద్ధి చెందుతుందని గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ హర్షం వ్యక్తం చేశాడు. మూడు దశాబ్దాలుగా ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్.. చెస్ ఒలింపియాడ్లో మనవాళ్లు మెరుగైన ప్రదర్శన చేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. చాలా మందికి మార్గనిర్దేశకుడిలా వ్యవహరించి చెస్వైపు వచ్చేలా చేశానని అభిప్రాయపడ్డాడు.
'భారత్లో చెస్ రంగం వృద్ధి చెందడంలో నా పాత్ర ఉన్నందుకు గర్వంగా ఉంది. 1987లో నేనే మొదటి గ్రాండ్మాస్టర్ను. కానీ, ఇప్పుడా ఆ సంఖ్య 52కు చేరింది. అదే ఆట వృద్ధి చెందుతుందనడానికి నిదర్శనం. 12 ఏళ్ల వయసులోనే ప్రజ్ఞానంద ఆ ఘనతను అందుకున్నాడు. 30ఏళ్లుగా చెస్ రంగం నిలకడగా వ్యాప్తి చెందుతూనే ఉంది. చెస్ ఒలింపియాడ్లో మనవాళ్లు విజయాలు సాధిస్తారనే నమ్మకం ఉంది' అని ఆనంద్ తెలిపాడు.
చెస్ ఒలింపియాడ్ సెప్టెంబర్ 23 నుంచి జార్జియాలో జరగనుంది. ఈ టోర్నీలో భారత జట్టు తన ప్రదర్శనను మెరుగుపర్చుకునే అవకాశం ఉందని ఆనంద్ చెబుతున్నాడు. 'కఠిన ప్రత్యర్థులు ఉన్నప్పటికీ చెస్ ఒలింపియాడ్లలో మనవాళ్లు బాగానే రాణిస్తున్నారు. ఇంకా కృషి చేసి టోర్నీకి వెళ్లి మన సత్తా చాటి మంచి ఫలితం రాబట్టాలి. నాలుగోస్థానంలో నిలిచాం అని చెప్పుకునే కన్నా మూడో స్థానంలో నిలిచి పతకం సాధించడంలో తప్పులేదు కదా. బలమైన జట్లు బరిలో ఉండడంతో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది'
'అవగాహన కోసం.. ఇప్పటికే క్రీడాకారులందరితో ఓ శిక్షణా శిబిరం నిర్వహించాం. ప్రత్యర్థి ఎవరో.. ఏ జట్టుతో తలపడనున్నామో.. ముందే తెలీదు కాబట్టి ఒలింపియాడ్లో చాలా శ్రమించాల్సి ఉంటుంది. హరికృష్ణ, విదిత్ పాయింట్ల విషయంలో నాకు దగ్గరగా ఉన్నారు. ఎలో రేటింగ్లో మేమందరం 2,700 స్థాయిలో ఉన్నాం. శశికిరణ్, భాస్కరన్ టాప్లో ఉన్నా కానీ వాళ్లకు నిలకడలేమి సమస్యగా మారింది. మొత్తానికి మన జట్టు సమతూకంగా ఉంది' అని ఆనంద్ పేర్కొన్నాడు.