ఢిల్లీ: ప్రతిష్టాత్మక టోక్యో పారాలింపిక్స్ 2020లో భారత్కు పతకం ఖాయం చేసిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్కు ప్రధాని నరేంద్ర మోదీ 'ఆల్ ది బెస్ట్' చెప్పారు. ఆదివారం జరగబోయే ఫైనల్ పోరులో ఒత్తిడికి గురికావొద్దని ఆయన సూచించారు. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో చైనా ప్యాడ్లర్ మియావో జాంగ్పై 3-2తో భవీనాబెన్ విజయం సాధించింది. వరల్డ్ నంబర్ త్రీ ప్లేయర్ అయిన జాంగ్ను 7-11, 11-7, 11-4, 9-11, 11-8 స్కోర్తో మట్టికరిపించింది. దీంతో ఫైనల్కు చేరిన తొలి భారత టీటీ ప్లేయర్గా భవీనాబెన్ రికార్డు సృష్టించింది.
IND vs ENG: నాలుగో రోజు చేతులెత్తేసిన బ్యాట్స్మన్.. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో భారత్ ఓటమి!!
'అభినందనలు భవీనాబెన్ పటేల్. అద్భుతంగా ఆడావు. రేపటి (ఆదివారం) మీ విజయం కోసం దేశం మొత్తం ప్రార్థిస్తోంది. మీ వంతు ప్రయత్నించండి. ఏ మాత్రం ఒత్తిడికి తలొగ్గకుండా ఆడండి. మీ విజయాలు దేశ ప్రజలందరికీ స్ఫూర్తినిస్తాయి' అని ట్విటర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ భవీనాబెన్ పటేల్ను ఉత్సాహపరిచారు. టోక్యో ఒలింపిక్స్ 2020 ఆరంభం అయినప్పటినుంచి ప్రధాని ఆటగాళ్లలో స్ఫూర్తినింపుతున్న విషయం తెలిసిందే. ఒలింపిక్స్ 2020 సమయంలో అథ్లెట్లతో ఆయన సమావేశాలు నిర్వహించారు. ఒలింపిక్స్ అనంతరం కూడా వారికి విందు ఇచ్చారు. ఇప్పుడు పారాలింపిక్స్ ఆటగాళ్లను కూడా ఆయన ఉత్సాహపరుస్తున్నారు.
We are proud of you #BhavinaPatel …go for gold 💪🏼💪🏼💪🏼 #Paralympics #praise4para https://t.co/60u5ChGrmT
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 28, 2021
సెమీ ఫైనల్లో చైనా క్రీడాకారిణి జాంగ్ మియావోపై భవీనాబెన్ పటేల్ తిరుగులేని విజయం సాధించింది. 3-2 తేడాతో ఆమెను ఓడించి దేశానికి కనీసం రజతం ఖాయం చేసింది. సెమీస్ అనంతరం భవీనాబెన్ మీడియాతో మాట్లాడుతూ... 'నేనిక్కడికి వచ్చినప్పుడు మరేం ఆలోచించకుండా 100% శ్రమించాలని అనుకున్నా. ఎందుకంటే వందశాతం కష్టపడితే పతకం కచ్చితంగా వస్తుంది. నా దేశ ప్రజల ఆశీర్వాదాలు, ఇదే ఆత్మవిశ్వాసంతో కొనసాగితే.. ఆదివారం కచ్చితంగా స్వర్ణం గెలవగలను. నేను పసిడి పోరుకు సిద్ధంగా ఉన్నాను. కచ్చితంగా గోల్డ్ గెలుస్తా' అని ధీమా వ్యక్తం చేసింది.
పారా ఒలింపిక్స్ 2020 టేబుల్ టెన్నిస్ పోటీల్లో భవీనాబెన్ పటేల్ ఫైనల్ చేరుకున్న తర్వాత ఆమె తండ్రి హస్ముఖ్ భాయ్ పటేల్ శనివారం మీడియాతో మాట్లాడారు. 'నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. నా కుమార్తె భవీనాబెన్ పటేల్ ఖచ్చితంగా బంగారు పతకం గెలుచుకోబోతోంది. గత 20 సంవత్సరాలుగా భవీనాబెన్ టేబుల్ టెన్నిస్ ఆడుతోంది' అని హస్ముఖభాయ్ పటేల్ చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న టోక్యో పారాలింపిక్స్లో భారత పారా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనాబెన్ పటేల్ గోల్డ్ మెడల్ మ్యాచ్లోకి దూసుకెళ్లిన తర్వాత, ఆమె తండ్రి హస్ముఖ్ భాయ్ పటేల్ తన కుమార్తె కచ్చితంగా విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో సెర్బియాకు చెందిన బోరిస్లావా పెరిక్ రాంకోవిచ్ని భావినాబెన్ 3-0తో ఓడించింది. ప్రపంచ నంబర్ 2, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అయిన రాంకోవిక్ను భారత క్రీడాకారిణి 18 నిమిషాల్లోనే 11-5, 11-6, 11-7 వరుస సెట్లలో ఓడించింది. భావినాబెన్ సెమీస్లోకి దూసుకెళ్లడంతో భారత్కు తొలి పతకం అప్పుడే ఖాయం అయింది. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ క్లాస్-4 విభాగంలో సెమీ ఫైనల్లో అడుగు పెట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్గాకూడా రికార్డులకెక్కింది.