న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ 2020 ఆరంభం నుంచి ముగిసేవరకు ప్రధాని నరేంద్ర మోదీ ఫాలో అయ్యారు. టోర్నీ ఆరంభానికి ముందు భారత అథ్లెట్లతో సమావేశమై వారిలో స్ఫూర్తి నింపారు. ఒక్కో అథ్లెట్ పతకం సాదిస్తుంటే.. వారిని అభినందించారు. ఇక పతకాలతో తిరిగొచ్చాక వారి ఆటతీరును ఆకాశానికెత్తేశారు. కాగా ప్రధాని మోదీ మరో మంచి పనికి పూనుకున్నారని సమాచారం తెలిసింది. నీరజ్ చోప్రా జావెలిన్, లవ్లీనా బోర్గోహైన్ బాక్సింగ్ గ్లోవ్స్, పీవీ సింధు రాకెట్ను వేలం వేయనున్నారని సమాచారం. వాటితో వచ్చిన డబ్బును ఓ స్వచ్చంద సంస్థ కోసం ఉపయోగించనున్నారట.
ఆగస్టు 16న టోక్యో ఒలింపిక్స్ 2020 క్రీడాకారులకు ప్రధాని మోదీ తన నివాసంలో అల్పాహార విందును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రతి అథ్లెట్లతో ప్రధాని ప్రత్యేకంగా ముచ్చటించారు. చాలా సమయం ఆటగాళ్లతో గడిపారు. పతకాలు తెచ్చిన వారినే కాకుండా అత్యుత్తమ ఆటతీరు కనబరిచిన వారిని, మెగా క్రీడల్లో ఆడిన అథ్లెట్లను ఆయన అభినందించారు. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం షట్లర్ పీవీ సింధుకు ఐస్క్రీం, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు చుర్మా తినిపించారు. అదే సమయంలో వారి వద్ద ప్రధాని వేలం ప్రతిపాదన తీసుకొచ్చారని తెలుస్తోంది.
Neerja Chopraతో ఇంటర్వ్యూ.. రేడియో జాకీల అసభ్యకర చిందులు! మండిపడుతున్న ఫ్యాన్స్!!
విందు సమయంలో నీరజ్ చోప్రా తన బళ్లెం ప్రధాని మోదీకి చూపించాడు. 'నువ్వు దీనిపై సంతకం చేశావు. నేను దీన్ని వేలం వేస్తాను. నీకు ఎలాంటి అభ్యన్తరం లేదుగా?' అని ప్రధాని అతడితో అన్నారు. దాంతో చిరునవ్వుతో నీరజ్ తన జావెలిన్ను మోదీకి బహూకరించాడు. ఆ తర్వాత పీవీ సింధు తన రాకెట్ను ప్రధానికి ఇచ్చింది. బాక్సర్ లవ్లీనా నుంచి ప్రధాని బాక్సింగ్ గ్లోవ్స్ తీసుకున్నారు. ఆపై మోదీ ఓ జోక్ చేశారు. 'నేనిప్పుడు వీటిని తీసుకున్నా కదా?. మోదీ తమనేమో చేయబోతున్నారని రాజకీయ నాయకులు అనుకుంటూ ఉంటారు' అని మోదీ సరదాగా అన్నారు. ఇవి మాత్రమే కాకుండా మిగతా క్రీడాకారుల నుంచీ ఆయన మరొకొన్ని వస్తువులను కూడా తీసుకుని వేలం వేస్తారట. ఆ డబ్బును ఓ స్వచ్చంద సంస్థకు ఇవ్వనున్నారు మోదీ.
టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్కు మొత్తం ఏడు మెడల్స్ వచ్చాయి. మెన్స్ హాకీ టీమ్తో పాటు నీరజ్ చోప్రా, పీవీ సింధు, రవికుమార్ దహియా, భజరంగ్ పూనియా, మీరాబాయి ఛాను, లవ్లీనా బోర్గోహైన్ పతకాలు గెలిచారు. అందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు నాలుగు కాంస్యాలు ఉన్నాయి. ఇంతకముందు 2012 లండన్ ఒలింపిక్స్లో భారత్ ఆరు పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. అయితే దీనిని పక్కకు తోస్తూ టోక్యో ఒలింపిక్స్లో భారత్ మరింత అద్బుతంగా ఆడింది.
ఇక జపాన్ నుంచి తిరిగివచ్చినప్పటినుంచి నీరజ్ చోప్రా పలు ఇంటర్వ్యూలతో బిజీబిజీగా గడుపుతున్నాడు. అతడిని ఇంటర్వ్యూ చేసేందుకు మీడియా ఉత్సాహాం చూపుతోంది. ముంబైకి చెందిన రెడ్ ఎఫ్ఎమ్ కూడా తాజాగా నీరజ్ను ఇంటర్వ్యూ చేసింది. పాపులర్ ఆర్జే మలిష్కా మెండోన్సా వీడియో కాల్ (జూమ్ యాప్) ద్వారా నీరజ్ను ఇంటర్వ్యూ చేసింది. అయితే ఇంటర్వ్యూ స్టార్ట్ కావడానికి ముందు ఆర్జే మలిష్కా తన తోటి ఉద్యోగులతో కలిసి ఓ పాత హిందీ పాటకు డ్యాన్స్ చేసింది. 'ఉడే జబ్ జబ్ జుల్ఫే తేరీ' సాంగ్కు ఆర్జే అమ్మాయిలు స్టెప్పులేశారు. నీరజ్ వీడియో కాల్ ద్వారా లైవ్లో ఉన్నప్పుడే వాళ్లంతా చిందేశారు. మలిష్కా తన ట్విట్టర్లో ఆ డ్యాన్స్కు చెందిన వీడియోను కూడా పోస్టు చేసింది. ఈ ఘటన పట్ల ఆన్లైన్లో విమర్శలు వెల్లువెత్తున్నాయి.