
హైదరాబాద్: జాతీయ స్థాయిలో రికార్డులు పొందినప్పటికీ.. బాలీవుడ్ సినిమా ద్వారా అన్ని విభాగాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఫోగట్ సిస్టర్స్. ఇండియా తరఫున ఎన్నో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని భారతదేశానికి పేరు తెచ్చిపెట్టిన ఫోగట్ సిస్టర్స్కు పెద్ద సమస్య ఎదురైంది. ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.
ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వీళ్లు నేషనల్ క్యాంప్కు హాజరు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన ఫెడరేషన్.. ఈ ఇద్దరితోపాటు వాళ్ల చెళ్లెల్లు రీతూ, సంగీతాలను కూడా లక్నోలో జరుగుతున్న నేషనల్ క్యాంప్ నుంచి బహిష్కరించింది రెజ్లింగ్ ఫెడరేషన్. నేషనల్ క్యాంప్కు ఎంపికైన అందరు రెజ్లర్లు మూడు రోజుల్లోపు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంది. వాళ్లకు ఏదైనా సమస్య ఉంటే వెళ్లి కోచ్లకు చెప్పి పరిష్కరించుకోవాలి.
ఈ క్రమంలో గీతా, బబితా అలా చేయకుండా ఉండిపోయారు వాళ్ల నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో వెళ్లి ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయండి అని చెప్పాం అని ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ వెల్లడించారు. నేషనల్ క్యాంప్ నుంచి బహిష్కరించారంటే ఇప్పుడు ఏషియన్ గేమ్స ట్రయల్స్లో పాల్గొనే అవకాశాన్ని కూడా వాళ్లు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ ఏడాది ఆగస్ట్, సెప్టెంబర్లో ఇండియోనేషియాలో ఏషియన్ గేమ్స్ జరగనున్నాయి.
అయితే వాళ్లు సంతృప్తికర వివరణ ఇవ్వగలిగితే మళ్లీ నేషనల్ క్యాంప్కు అనుమతించే అవకాశం ఉంటుందని ప్రెసిడెంట్ ఆఫ్ రెజ్లింగ్ ఫెడరేషన్ బ్రిజ్భూషణ్ చెప్పారు. మరోవైపు గాయం కారణంగానే నేషనల్ క్యాంప్కు తాను వెళ్లలేకపోయానని బబితా చెప్పింది. రెండు మోకాళ్ల గాయాల నుంచి తాను ఇంకా కోలుకోలేదని ఆమె తెలిపింది. ఫెడరేషన్కు తాను సమాచారం ఇవ్వని విషయం నిజమేనంటూ అంగీకరించింది. వెంటనే వాళ్లకు వివరణ ఇస్తానని స్పష్టంచేసింది.
ఆమె సోదరి గీతా ఫొగాట్ బెంగళూరులో ప్రైవేట్ శిక్షణ తీసుకుంటుందని, ఆమె క్యాంప్కు ఎందుకు వెళ్లలేదన్న విషయం మాత్రం తమకు తెలియదంటూ బబిత చెప్పింది. ఏషియన్ గేమ్స్ ట్రయల్స్కు ఫెడరేషన్ తమను అనుమతిస్తోందన్న విశ్వాసాన్ని బబితా వ్యక్తంచేసింది. గీతా 2010లో, బబితా 2014 కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్స్ సాధించారు. ఈ మధ్యే ముగిసిన గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో బబితా సిల్వర్ మెడల్ సాధించింది.