టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్న టోక్యో పారాలింపిక్స్ 2020లో భారత అథ్లెట్ వినోద్ కుమార్కు భారీ షాక్ తగిలింది. పురషుల డిస్కస్ త్రో ఎఫ్52 క్లాస్లో ఆదివారం అతడు గెలిచిన బ్రాంజ్ మెడల్ను కోల్పోయాడు. టోక్యో పారాలింపిక్స్ 2020 టెక్నికల్ కమిటీ అధికారులు.. వినోద్ కుమార్ను ఎఫ్52 క్లాస్ డిస్కస్కు అనర్హుడిగా తేల్చారు. దీంతో ఈ కాంపిటిషన్లో వినోద్ సాధించిన ఫలితాన్ని రద్దు చేయడంతో బ్రాంజ్ మెడల్ కోల్పోయాడు. అతడికుముందు డిస్కస్ త్రో F52 కేటగిరీలో ఆదివారం వినోద్ కుమార్ డిస్క్ను 19.91 మీటర్ల దూరం విసిరి బ్రాంజ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే.
టోక్యో పారాలింపిక్స్ 2020 పురషుల డిస్కస్ త్రో F52 కేటగిరీలో ఆదివారం భారత అథ్లెట్ వినోద్ కుమార్ డిస్క్ను 19.91 మీటర్ల దూరం విసిరి బ్రాంజ్ మెడల్ను సాధించిన సంగతి తెలిసిందే. అయితే వినోద్ కుమార్ F52 కేటగిరీ పరిధిలోకి రాడని ఫిర్యాదు అందడంతో.. అతడు గెలిచిన పతకాన్ని నిర్వహకులు హోల్డ్లో ఉంచారు. ఫిర్యాదును సమీక్షించిన పారాలింపిక్స్ 2020 టెక్నికల్ కమిటీ నిర్వహకులు వినోద్ కుమార్ F52 కేటగిరీ పరిధిలోకి రాడని తేల్చారు. దీంతో అతడు గెలుచుకున్న బ్రాంజ్ మెడల్ను నిర్వహకులు రద్దు చేశారు. దీంతో వినోద్ కుమార్తో పాటు ఇండియాకు నిరాశే ఎదురైంది.
వినోద్ కుమార్ కాంస్య పతకం రద్దు చేస్తున్నట్లు టోక్యో పారాలింపిక్స్ నిర్వహకులు ఈరోజు అధికారికంగా ప్రకటించారు. కండరాల బలహీనత, కదలికల్లో లోపం, అవయవ లోపం ఉన్న వారు మాత్రమే F52 కేటగిరీ పరిధిలోకి వస్తారని.. వినోద్ కుమార్ ఈ కేటగిరీ పరిధిలోకి రాడని వారు తేల్చారు. అయితే ఈ నిర్వహకులే ఈ నెల 22న వినోద్ కుమార్ F52 కేటగిరీలో పోటీపడవచ్చని అనుమతివ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వస్తున్నాయి. అప్పుడు అనుమతి ఇచ్చి.. ఇప్పుడు ఎందుకు ఇలా చేశారు? అని ప్రశ్నిస్తున్నారు.
పారా అథ్లెట్లను వాళ్ల వైకల్యం రకం, దాని తీవ్రతను బట్టి వర్గీకరిస్తారు. వాళ్ల స్థాయిలోనే వైకల్యం ఉన్న ఇతర అథ్లెట్లతో పోటీ పడేందుకు వీలుగా అనుమతిని ఇస్తారు. ఇక డిస్కస్ త్రోలో ఎఫ్52 క్లాస్ అనేది.. బలహీన కండరాల శక్తి, వాటి కదలికల్లో అడ్డంకులు వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని వర్గీకరిస్తారు. ఇలాంటి అథ్లెట్లు కూర్చొని వారి పోటీల్లో పాల్గొంటారు. సాధారణంగా వెన్నెముకకు గాయమైన అథ్లెట్లు ఇలాంటి కేటగిరీలో ఉంటారు.
మరోవైపు పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56 ఈవెంట్లో భారత అథ్లెట్ యోగేష్ కథునియా 44.38 మీటర్లతో రజత పతకాన్ని సాధించాడు. 24 ఏళ్ల యోగేష్ 44.38 మీటర్ల సీజన్ అత్యుత్తమ త్రోతో ఇండియాకు పతకాన్ని అందించాడు. కథునియా తన రెండవ ప్రయత్నంలో 42.84 మీటర్లు విసిరి తన నాడీ శక్తిని చాటుకున్నాడు. తన చివరి ప్రయత్నంలో కథూనియా 44.38 మీటర్ల రజత పతకాన్ని సాధించాడు. బెర్లిన్లో 2018 పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్లో యోగేష్ తన తొలి అంతర్జాతీయ పోటీలో ప్రపంచ రికార్డును అధిగమించాడు.