
హైదరాబాద్: ప్రపంచ అండర్-20 ఛాంపియన్షిప్లో భారత్కు స్వర్ణం సాధించిన స్ప్రింటర్ హిమదాస్పై నజరానాల వర్షం కురుస్తోంది. ఫిన్ల్యాండ్ వేదికగా జరిగిన 400 మీటర్ల ఈవెంట్లో 51.46 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకున్న హిమదాస్పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఇప్పటికే రూ.50 లక్షల నజరానా ప్రకటించగా, తాజాగా ఆయిల్ ఇండియా రూ.20 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. ఈ మేరకు ఆయిల్ ఇండియా అధికారిక ప్రకటన చేసింది. ఆమెకు ఒలింపిక్స్తో సహా రానున్న అన్ని టోర్నీల కోసం అవసరమైన ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది.
ఆయిల్ ఇండియా సీఎండీ మాట్లాడుతూ హిమదాస్కు అండగా ఉంటామని అన్నారు. అసోం నుంచే వచ్చే క్రీడాకారులకు నెలకు రూ.17 వేల స్కాలర్షిప్ అందిస్తున్నట్టు ఆయన చెప్పారు. స్కాలర్షిప్ అందుకుంటున్న వారిలో అండర్-19 ప్రపంచకప్ క్రికెటర్ రియాన్ పరాగ్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి త్రిషా గొగోయ్ తదితరులు ఉన్నారు.
తదుపరి టోర్నీల్లో పాల్గొనేందుకు కూడా వీరికి అవసరమైన సాయం అందిస్తామని ఉత్పల్ బోరా తెలిపారు. మరోవైపు హిమదాస్ ప్రతిభకు మెచ్చిన మహింద్రా గ్రూప్స్ యజమాని ఆనంద్ మహింద్రా ఇప్పటికే ఆమెకు అండగా నిలిచారు. ఆమెకు ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్విట్టర్లో వెల్లడించారు.
'ఇప్పుడు ప్రతీ ఒక్కరూ హిమదాస్ను ఒలింపిక్ పోడియంపై చూడాలనుకుంటున్నారు. ఇందుకోసం రాజ్యవర్ధన్ రాథోర్, అథ్లెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆమెకు సరైన శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఒకవేళ ప్రభుత్వ నిధులే కాకుండా.. ఆమెకు ఎలాంటి ఆర్థిక సహాయం కావాల్సి వచ్చినా.. సాయం చేసేందుకు నేను ఎప్పుడు సిద్ధమే' అని ట్వీట్ చేశారు.