|
90 మీటర్ల చేరువలో నీరజ్..
ఒలింపిక్స్ తర్వాత పది నెలలు విశ్రాంతి తీసుకున్న అతను పావో నుర్మీ గేమ్స్ బరిలోకి దిగాడు. ఈ పోటీల్లో జావెలిన్ను 89.30 మీటర్ల దూరం విసిరి తన రికార్డును మెరుగుపరుచుకోవడంతో పాటు రజతం గెలుచుకున్నాడు. తొలి ప్రయత్నంలో 86.92 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా.. రెండో ప్రయత్నంలో 89.30 మీటర్లు విసిరాడు. ఆ తర్వాత మూడు ప్రయత్నాలు ఫాల్స్ కాగా.. చివరి ప్రయత్నంలో 85.85కే పరిమితమయ్యాడు. ఫిన్లాండ్కు చెందిన ఓలీవర్ హీలేండర్ 89.83 మీటర్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
90+ మీటర్లు విసరడమే టార్గెట్..
ఈ టోర్నీకి ముందు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీరజ్ ఆసక్తికర విషయాలు చెప్పాడు. భారత్లోని పలువురు అథ్లెట్లు 80 మీటర్లకుపైగా జావెలిన్ త్రో చేస్తున్నారని తెలిసి మీరెలా ఫీలవుతున్నారని అడిగిన ప్రశ్నకు నీరజ్ ఇలా బదులిచ్చాడు. 'చాలా సంతోషంగా ఉంది. మన దేశంలో చాలా మంది అథ్లెట్లు 80+ మీటర్లు జావెలిన్ విసురుతున్నారు. రోహిత్, యశ్విర్, మను, సాహిల్తో పాటు పలువురు జూనియర్లు కూడా మంచి ప్రదర్శన చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలోనూ అండర్సన్ పీటర్స్, జాకుబ్ వాద్లెచ్ వంటి అథ్లెట్లు ఈ ఏడాది 90+ మీటర్లు విసిరారు. దీంతో జావెలిన్ త్రో ఆటలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి' అని పేర్కొన్నాడు.
ఆ అరుదైన క్లబ్లోకి..
ఇక రాబోయే టోర్నమెంట్లలో ఎలాంటి ప్రదర్శన చేయాలనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు.. 'ఈ ఏడాది మరింత నిలకడగా రాణించాలనుకుంటున్నా. నా ఫిట్నెస్ కొనసాగిస్తూ అత్యుత్తమ ప్రదర్శన చేసి మెరుగైన ఫలితాలు సాధించాలని అనుకుంటున్నా. ఇప్పుడు నేను 90 మీటర్ల దూరానికి చేరువలో ఉన్నా. ఇప్పుడు 90+ మీటర్ల రికార్డు చేరితే చాలా సంతోషంగా ఉంటా. నేను ఆ అరుదైన క్లబ్లో ఉండాలనుకుంటున్నా' అని నీరజ్ చెప్పుకొచ్చాడు.