ఢిల్లీ: షూటింగ్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భారత అథ్లెట్ మను భకర్. 16 ఏళ్ల ప్రాయం నుంచే అదరగొడుతున్న మను.. 2018 యూత్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి భారత నంబర్ వన్ షూటర్గా నిలిచింది. ఇక అప్పటి నుంచి ప్రతీ టోర్నీలో పతకాల వేట సాగిస్తోంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన మను.. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తోంది.
పెళ్లైన పదేళ్ల తర్వాత పరిస్థితి ఇదీ.. షోయబ్ చెవి మెలిపెడుతున్న సానియా!!
మహమ్మారి కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా క్రీడాకారులంతా ఇళ్లలోనే ఉంటూ సాధనలో మునిగిపోయారు. ఈ సందర్భంగా టీనేజ్ సెన్సేషన్ మను భకర్ తన ఇంటి ఆవరణలో ప్రాక్టీస్ చేస్తుంటే కొన్నిసార్లు కోతుల బెడద ఉంటోందని తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. 'రోజుకు 4గంటలు సాధన చేస్తున్నా. అయితే మా ప్రాంతంలో కొన్ని కోతులున్నాయి. అవి మా ఆవరణలోకి వచ్చి అంతరాయం కలిగిస్తుండడమే చికాకు తెప్పిస్తోంది' అని వివరించింది.
లాక్డౌన్తో తన ట్రెయినింగ్కు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అడగ్గా.. తాను రోజూ ప్రాక్టీస్ చేస్తున్నానని మను భకర్ చెప్పింది. తన ఇంటి ఆవరణలోనే ప్రాక్టీస్ చేసేందుకు అనువైన ఏర్పాట్లున్నాయని, అయితే కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు తలెతున్నాయని తెలిపింది. తనకున్న మాన్యువల్ మెషిన్ తరచూ మరమ్మతులకు గురౌతుండడంతో ఆటంకం కలుగుతుందని పేర్కొంది.
ఇక లాక్డౌన్తో జరిగిన ఒక మంచి విషయం ఏంటని అడిగితే.. దీనివల్ల గాలి నాణ్యత పెరిగిందని మను భకర్ చెప్పింది. ప్రజలకు కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసుండే అవకాశం కలిగిందని వివరించింది. బుధవారం జరిగే ఆన్లైన్ అంతర్జాతీయ షూటింగ్ చాంపియన్షిప్కు సిద్ధమవుతున్నా అని 18 ఏళ్ల మను చెప్పుకొచ్చింది. కరోనా వైరస్ ప్రబలక ముందు మేమంతా మంచి ఫామ్లో ఉన్నామంది. వైరస్ అంతకంతకు విస్తరిస్తున్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తూ నిర్వహకులు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
'కరోనాతో కొన్ని టోర్నీలు వాయిదా పడుతాయనుకున్నాను. కానీ ఒలింపిక్స్తో సహా అన్నింటి మీద దీని ప్రభావం పడింది. మేము ఇటీవల కాలంలో మంచి ఫామ్మీదున్నాం. ఎదురైన టోర్నీల్లో మనవాళ్లు పతకాలు కొల్లగొట్టారు. ఇదే రీతిలో ఒలింపిక్స్లోనూ రాణించాలన్న ధీమాతో కనిపించాం. కానీ కరోనాతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి' అని మను చెప్పుకొచ్చిది.