హైదరాబాద్: భారత షూటర్లు సౌరభ్ చౌదరి, మను బాకర్ జోడీ ఆసియా ఎయిర్గన్ షూటింగ్ చాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శన చేసింది. ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. చైనీస్ తైపీలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో బుధవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ స్వర్ణం చేజిక్కించుకుంది. ఈ క్రమంలో క్వాలిఫికేషన్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
17 ఏళ్ల మను, 16 ఏళ్ల సౌరభ్ క్వాలిఫికేషన్లో 784 పాయింట్లు స్కోరు చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. గతంలో ఈ రికార్డు రష్యా జంట బత్సారిష్కినా, చెర్నొసోవ్ల పేరిట ఉంది. భారత జోడీ ఫైనల్లో 484.8 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోవడంతోపాటు స్వర్ణం సొంతం చేసుకుంది.
హవాంగ్ సియోన్జెయున్-కిమ్ మోస్ (కొరియా-481.1 పాయింట్లు) జోడీ రజతం నెగ్గగా... వు చియా యింగ్-కు కువాన్ టింగ్ (చైనీస్ తైపీ-413.3 పాయింట్లు) జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాయి. భారత్కు చెందిన అనురాధ, అభిషేక్ వర్మల జోడీ నాలుగో స్థానం (372.1 పాయింట్లు)లో నిలిచింది.
ఇషా-విజయ్వీర్ జంటకు స్వర్ణం
ఇదే టోర్నీ జూనియర్ మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ తన భాగస్వామి విజయ్వీర్ సిద్ధూతో కలిసి స్వర్ణం సాధించింది. ఫైనల్లో ఇషా-విజయ్వీర్ జోడీ 478.5 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. క్వాలిఫయింగ్లో ఇషా-విజయ్వీర్ జంట 769 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.