హైదరాబాద్: 2028లో జరిగే ఒలింపిక్స్కు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరం ఆతిథ్యం ఇచ్చేందుకు అంతా సిద్ధమైంది. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తాజాగా సంకేతాలు జారీ చేసింది. అయితే పూర్తి స్థాయి వివరాలను ఒలింపిక్ కమిటీ త్వరలో వెల్లడించనుంది.
2024లో జరిగే ఒలింపిక్స్ క్రీడలకు పారిస్ నగరం ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి 2024లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు లాస్ ఏంజిల్స్ బిడ్డింగ్లో పోటీ పడింది. అయితే అనూహ్యంగా ఆ అవకాశం పారిస్కు దక్కింది. దీంతో 2028 క్రీడలను లాస్ ఏంజిల్స్కు కేటాయించారు.
ఇందులో భాగంగా ఒలింపిక్ కమిటీ నుంచి అదనపు నిధులను లాస్ ఏంజిల్స్ పొందనుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ అంటే మామూలు విషయం కాదు. ఈ క్రీడల నిర్వహణ కోసం సుమారు రెండు బిలియన్ల డాలర్ల సహాయాన్ని ఒలింపిక్ కమిటీ లాస్ ఏంజిల్స్కు అందించనుంది.