
హైదరాబాద్: సిడ్నీ వేదికగా జరుగుతోన్న జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్లో భారత యువ షూటర్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే ఈ వరల్డ్ కప్లో రెండు స్వర్ణాలు గెలుచుకున్న మను బకర్.. మంగళవారం జరిగిన 10 మీటర్ల మిక్స్డ్ ఎయిర్ ఫిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో అన్మోల్తో కలిసి పసిడి నెగ్గింది.
ఫైనల్లో ఈ జంట 478.9 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ విభాగంలో ఉన్న ప్రపంచ రికార్డుకు 1.8 పాయింట్లు మాత్రమే తక్కువగా సంపాదించారు. అంతకముందు క్వాలిఫయింగ్ రౌండ్లో బాకర్-అన్మోల్ 770 పాయింట్లతో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించారు.
ఈ విభాగంలో చైనాకు చెందిన లియు జినాయో-లీ జుయ్ (473.3 పాయింట్లు), వాంగ్ జెహహో-జియావో జిరుక్సియాన్ (410.7 పాయింట్లు) వరుసగా రజత, కాంస్య పతకాలను సాధించారు. కాగా, భారత్కు చెందిన గౌరవ్ రానా-మహిమా తుర్హి అగర్వాల్ల జోడి 370.2 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచారు.
మరోవైపు 10 మీటర్ల మిక్స్డ్ ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో శ్రేయా అగర్వాల్-అర్జున్ బబుతా 432.8 పాయింట్లతో కాంస్యంను సాధించారు. ఎలావెనిల్-కృష్ణ ప్రసాద్ 389.1 పాయింట్లతో నాలుగోస్థానంలో నిలిచారు. జూనియర్ మహిళల వ్యక్తిగత స్కీట్లో జెనిమట్ సికెన్ రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకుంది.
మొత్తంగా భారత్ మొత్తం 7 స్వర్ణాలతో కలిపి మొత్తం 18 పతకాలతో పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉండగా, చైనా 8 స్వర్ణాలతో (22 పతకాలు) అగ్రస్థానంలో కొనసాగుతోంది.