సిడ్నీ: టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ కోసం ఇప్పటివరకు అయితే ఎలాంటి డెడ్లైన్లు లేవని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కో ఆర్డినేషన్ కమిషన్ అధికారి జాన్ కోట్స్ ఓ ప్రకటనలో తెలిపారు. ఒలింపిక్స్ నిర్వహణపై నిర్ణయం తీసుకోవడానికి మే నెలను గడువుగా విధించలేదన్నారు. జూలై 24న ఒలింపిక్స్ను ఆరంభించాలనే అనుకుంటున్నాం అని జాన్ కోట్స్ పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం జూలై 24 నుంచి ఆగస్టు 9వరకు విశ్వక్రీడలు జరగాల్సి ఉంది.
కరోనా ఎఫెక్ట్.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అత్యవసర సమావేశం!!
ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ (కొవిడ్-19) మహమ్మారి కాటేయడంతో దాదాపు అన్ని దేశాల్లోనూ క్వాలిఫయింగ్ టోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ను నిర్వహిస్తారా లేదా అనే నిర్ణయం తీసుకునేందుకు తుదిగడువు లేదని కోట్స్ స్పష్టం చేశారు. ఆసీస్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు కూడా అయిన కోట్స్.. ఒలింపిక్స్ పనుల మీద ఐరోపాలో పర్యటిస్తున్నారు. ఈ వారంలో ఆస్ట్రేలియా తిరిగి రానున్నారు. వచ్చాక ప్రభుత్వం విధించిన 14 రోజుల నిర్బంధంలోకి వెళ్లనున్నారు.
కరోనా వైరస్ విజృంభణతో టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై అనుమానాలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. జపాన్ ప్రధాని షింజో అబేతో పాటు ఐవోసీ చీఫ్ థామస్ బాచ్ ఒలింపిక్స్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ప్రకటించినా.. జపాన్వాసుల్లో అత్యధికులు విశ్వక్రీడలు నిలిపివేస్తేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. తమ జీవితాలను తాకట్టు పెట్టి క్రీడలను నిర్వహించొద్దని ప్రభుత్వాన్ని కోరారు. జపాన్లో ఇప్పటికే 814మంది కరోనా వైరస్కు గురికాగా.. 24మంది మరణించారు.
కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండడంతో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు ఐవోసీ మంగళవారం సభ్యక్రీడా దేశాలతో పాటు వివిధ క్రీడా ప్రపంచ సమాఖ్యలతో అత్యవసర సమావేశం నిర్వహించనుంది. కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ఈ సమావేశం జరుగనుంది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 6,500మందికి పైగా మృతి చెందగా.. లక్షా 75వేల మంది వైరస్ బారిన పడ్డారు.