
హైదరాబాద్: 2020లో జరిగే సమ్మర్ ఒలింపిక్స్కు జపాన్లోని టోక్యో నగరం ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఒలింపిక్స్కు రెండేళ్లే సమయం ఉండటంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. ఇందులో భాగంగా బుధవారం నిర్వాహకులు టొక్యో ఒలింపిక్స్ మస్కట్లను విడుదల చేశారు.
సుమారు 2,042 మంది ఒలింపిక్స్కు సంబంధించిన మస్కట్ల నమూనాలను రూపొందించి నిర్వాహకులకు అందించారు. ఇందులో మూడు డిజైన్లను నిర్వాహకులు ఎంపిక చేశారు. అనంతరం వీటికి ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్లో జపాన్ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు పాల్గొన్నారు.
చివరకు పై ఫోటోలో చూస్తున్న మస్కట్లకు రికార్డు స్థాయిలో ఓట్లు దక్కాయి. తెలుపు, ముదరు నీలం రంగులో ఉన్న మస్కట్ ఒలింపిక్స్కు, తెలుపు, గులాబీ రంగు ఉన్న మరో మస్కట్ పారాఒలింపిక్స్ను సూచిస్తుందని నిర్వాహకులు వెల్లడించారు.
అయితే ఈ రెండు మస్కట్లకు ఇంకా నిర్వాహకులు పేర్లు ఖరారు చేయలేదు. ఈ రెండు మస్కట్లు కూడా 'ఒకరినొకరు గౌరవించుకుంటాయి.. మంచి స్నేహితులు' అని పేర్కొన్నారు. తెలుపు, ముదరు నీలం రంగులో ఉన్న మస్కట్ ఓ ప్రత్యేకమైన పవర్ను కలిగి ఉంటుందని తెలిపారు.
'ఈ మస్కట్ న్యాయం విషయంలో బలమైన భావన కలిగి ఉంటుంది, అంతేకాదు మంచి అథ్లెట్ కూడా" అని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక, పారాఒలింపిక్స్ను సూచించే గులాబీ రంగు ఉన్న మస్కట్ డిజైన్ చెర్రీ బ్లాసమ్ ప్లవర్స్ ప్రేరణతో రూపొందించబడిందని అన్నారు.
ఈ రెండు మస్కట్లను రూపొందించిన రయో తనిగుచి దక్షిణ జపాన్లోని పుకోకాకు చెందిన ఓ చిత్రకారుడు. ఈ మస్కట్లను ఎంపిక చేసే ప్రక్రియ జపాన్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మస్కట్ల ఎంపిక ప్రక్రియలో 16 వేలకుపైగా స్కూళ్లలోని రెండు లక్షల మంది విద్యార్ధులు పాలుపంచుకున్నారు.