న్యూఢిల్లీ: కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జపాన్ వేదికగా జరగనున్న టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే తమ అథ్లెట్లను ఒలింపిక్స్కు పంపమని కెనడా తేల్చిచెప్పగా.. ఆస్ట్రేలియా కూడా అదే ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్పై తమ నిర్ణయాన్ని మరో 4-5 వారాల్లో చెబుతామని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఐఓఏ సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా తెలిపారు.
'మరో నాలుగు నుంచి అయిదు వారాలు ఎదురుచూస్తాం. ఆ తర్వాత అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం (ఐఓసీ), క్రీడా మంత్రిత్వ శాఖను సంప్రదించి టోక్యో ఒలింపిక్స్పై ఓ నిర్ణయానికి వస్తాం. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో పరిస్థితి అంత ప్రమాదకరంగా లేదు'అని రాజీవ్ మెహతా అన్నారు. ఇప్పటికే కరోనా దెబ్బకు ప్రపంచమంతా అతలాకుతలం అవుతుండగా.. ఒలింపిక్స్ వాయిదావేయాలనే డిమాండ్ కూడా వ్యక్తం అవుతుంది.
అగ్రరాజ్యం అమెరికాకు కూడా ఈ మెగా ఈవెంట్ను వాయిదా వేయాలని జపాన్కు సూచించింది. దీంతో సభ్యదేశాల అభిప్రాయాన్ని ఐఓసీ కోరిన విషయం తెలసిందే. షెడ్యూల్ ప్రకారం జపాన్లోని టోక్యో నగరంలో జులై 24న ఒలింపిక్స్, ఆగస్టు 25న పారాలింపిక్స్ నిర్వహించాల్సింది. ప్రపంచవ్యాప్తంగా వద్దంటున్నా.. జపాన్ మాత్రం ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తామంటోంది. ఇక భారత్లో కరోనా భాదితుల సంఖ్య 350 ధాటింది.