హైదరాబాద్: ఆసియా గేమ్స్కు ఇండోనేషియా రాజధాని జకార్తా ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు రాజధాని జకార్తా, పాలెంబంగ్లలో ఈ ఆసియా గేమ్స్ను నిర్వహించనున్నారు. అయితే, క్రికెట్కు వరల్డ్ కప్, ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఫుట్బాల్ వరల్డ్ కప్ లాగే నాలుగేళ్లకోసారి ఈ ఆసియా గేమ్స్ జరుగుతుంటాయి.
ఆసియా గేమ్స్ ఓ ఖండానికే పరిమితమైనప్పటికీ ఈ గేమ్స్లో మొత్తం 45 దేశాలు పాల్గొంటాయి. దీంతో ఒలింపిక్స్ స్థాయి ఉన్న ఈవెంట్గా దీనిని పరిగణిస్తుంటారు. కామన్వెల్త్ క్రీడల్లో ఇంతకంటే ఎక్కువ (71) దేశాలు పాల్గొంటునప్పటికీ, క్రీడాంశాలను లెక్కలోకి తీసుకుంటే మాత్రం ఆసియా క్రీడల్లోనే ఎక్కువగా ఉండటం విశేషం.
ప్రస్తుతం జరగబోయే ఆసియా గేమ్స్లో 45 దేశాలు పాల్గొననున్నాయి. మొత్తం 40 క్రీడాంశాల్లోని 465 ఈవెంట్లకు పోటీలు జరుగనున్నాయి. ఈసారి పోటీలకు ఇండోనేసియాలోని జకార్తా, పాలెంబాంగ్ నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే సర్వం సిద్ధమైంది.
ఇలా రెండు నగరాలు వేదికగా నిలవడం ఆసియా గేమ్స్ చరిత్రలో ఇదే తొలిసారి. ఒలింపిక్స్, కామన్వెల్త్ లాగా ఆసియా దేశాలకు ఓ క్రీడోత్సవం ఉండాలన్న ఆలోచన మొట్టమొదటి సారి జపాన్, ఫిలిప్పీన్స్, చైనా చొరవతో 1912లో అంకురార్పణ జరిగింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా వేదికగా తదుపరి ఏడాదే ఇది కార్యరూపం దాల్చింది.
అప్పుడు 'ఫార్ ఈస్ట్రన్ గేమ్స్ చాంపియన్షిప్' పేరిట ఈ క్రీడలను నిర్వహించారు. ఆరు దేశాలు మాత్రమే ప్రాతినిధ్యం వహించాయి. రెండేళ్లకోసారి చొప్పున 1934 వరకు ఈ టోర్నీ జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం భారత్ సహా చాలా ఆసియా దేశాలు స్వాతంత్య్రం పొందడంతో పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారాయి.
దీంతో ఏషియాడ్ దిశగా అడుగులు పడ్డాయి. 1948 వేసవి ఒలింపిక్స్ సందర్భంగా లండన్లో చైనా, ఫిలిప్పీన్స్ దేశాల క్రీడా ప్రతినిధులు 'ఫార్ ఈస్ట్రన్' పునరుద్ధరణను తెరపైకి తెచ్చారు. అయితే, ఇది సరికొత్త రూపు దాల్చిన ఆసియా దేశాల అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా లేదండూ ఒలింపిక్ కమిటీలో భారత ప్రతినిధి అయిన గురుదత్ సోంధి 'ఏషియాడ్' అనే పేరుని తెరపైకి తీసుకొచ్చారు.
ఇదే ప్రాతిపదికపై 1949లో ఢిల్లీలో 'ఆసియా అథ్లెటిక్ సమాఖ్య', 'ఆసియా క్రీడల సమాఖ్య'లను ఏర్పాటు చేశారు. తొలి ఆసియా గేమ్స్ను 1951లో ఢిల్లీలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 1951తో పాటు 1982లో ఏషియాడ్కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ రెండుసార్లూ ఢిల్లీ వేదికగానే గేమ్స్ జరిగాయి. అత్యధికంగా థాయ్లాండ్ నాలుగు సార్లు పోటీలను నిర్వహించింది.