న్యూ ఢిల్లీ: ఆసియాడ్ పతక విజేతలకు భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) ఆదివారం ఏర్పాటు చేసిన నగదు బహుమతి సత్కార కార్యక్రమం అభాసుపాలైంది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో క్రీడాకారులకు ఐఓఏ నగదు బహుమతులు అందించాల్సి ఉంది. చెక్లపై చాలామంది అథ్లెట్ల పేర్లు తప్పుల తడకగా రాయగా.. రెజ్లర్ దివ్య కక్రాన్కు అది కూడా అందలేదు. ఆర్చర్లు జ్యోతి సురేఖ, అభిషేక్ వర్మ సహా 15మంది పేర్లు తప్పుగా రావడంతో వారికి పుష్పగుచ్ఛాలు మాత్రమే ఇచ్చి సరిపెట్టారు.
ఆతిథ్యం కోసం భారత్ ఉత్సాహం: 2026 యూత్ ఒలింపిక్స్కు బిడ్
ఆసియాడ్ టీమ్ ఈవెంట్లలో స్వర్ణం, రజత, కాంస్య పతకాలు సాధించిన వారికి రూ. 3 లక్షలు, రూ. 2 లక్షలు, రూ. లక్ష చొప్పన బహుమతి ఇవ్వాలని ఐవోఏనే నిర్ణయించింది. వ్యక్తిగతంగా పసిడి, రజత, కాంస్య పతకాలు గెలిచిన అథ్లెట్లకు మాత్రం రూ. 5 లక్షలు, రూ. 3 లక్షలు, రూ. 2 లక్షలు ప్రకటించింది. అయితే, తప్పిదాన్ని గుర్తించిన ఐవోఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా క్షమాపణలు కోరారు.
'తప్పు చేసినందుకు ముందుగానే క్షమాపణ చెబుతున్నాం. కనీసం 14-15 మంది క్రీడాకారుల పేర్లు తప్పుగా అచ్చయ్యాయి. కాబట్టి ఆ క్రీడాకారులకు పుష్పగుఛ్చాలను మాత్రమే ఇస్తాం. ఆందోళన వద్దు.. నగదు బహుమతులు ఇచ్చేస్తాం. తప్పుడు పేర్లతో ఉన్న చెక్కులను ఇవ్వాలనుకోవట్లేదు' అని ఐఓఏ అధ్యక్షుడు నరిందర్ బత్రా చెప్పాడు.
త్వరలోనే తప్పులు సరిచేసి మిగతా అథ్లెట్లకూ చెక్లను అందజేస్తానని హామీ ఇచ్చారు. అయితే, కాంస్యం నెగ్గిన రెజ్లర్ దివ్య కక్రాన్ పేరు జాబితాలోనే లేకుండా పోవడం మరింతగా ఇబ్బంది పెట్టింది. సన్మాన కార్యక్రమం ముగిసిన తర్వాత ఆమె తల్లిదండ్రులు ఈ విషయాన్ని బాత్రా దృష్టికి తీసుకెళ్లారు.