టోక్యో: ప్రతిష్ఠాత్మకంగా సాగుతోన్న ఒలింపిక్స్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బ్యాడ్మింటన్లో వరల్డ్ నంబర్ వన్ జోడీ ఇంటిదారి పట్టింది. పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్లో ఇండోనేషియన్ పెయిర్ మార్కస్ గిడియన్, కెవిన్ సుకముల్జో కలలు చెదిరిపోయాయి. బ్యాడ్మింటన్ డబుల్స్లో ఇప్పటిదాకా ఆడిన మ్యాచ్లన్నింట్లోనూ ఏకపక్షంగా విజయం సాధిస్తూ వచ్చిన ఈ జోడీ..ప్రస్థానం డబుల్స్ కేటగిరీలో ముగిసినట్టే. భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ భమిడిపాటి సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టితో మూడో రౌండ్లో తలపడి.. విజయం సాధించిన తరువాత తదుపరి మ్యాచ్లో పొరుగు దేశం మలేసియాను ఢీ కొట్టింది.
ముసాషినో ఫారెస్ట్ ప్లాజా కోర్ట్ 2లో మలేసియాకు చెందిన స్టార్ షట్లర్లు ఆరోన్ చియా, వూయి సో చేతిలో 21-14, 21-17 వరుస సెట్ల తేడాతో ఇండోనేషియన్ జోడీ పరాజయం పాలైంది. 33 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. సాధారణంగా డిఫెన్స్లో అద్భుతంగా రాణిస్తుంటుంది.. మార్కస్/కెవిన్ జంట. మలేసియా వద్ద మాత్రం ఆ పప్పులు ఉడకలేదు. డిఫెన్స్ను ఛేదించుకుంటూ మలేసియా జంట ఆడిన డ్రాప్ షాట్లు అద్భుతం అనిపించాయి. మార్కస్/కెవిన్ జోడీపై తాము విజయం సాధించామంటే ఇప్పటికీ నమ్మశక్యం కావట్లేదంటూ ఆరోన్ చియా వ్యాఖ్యానించాడంటే వారి ఆట తీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ మ్యాచ్లో విజయం సాధించడానికి తాము రూపొందించుకున్న వ్యూహాలు, ఆన్ గ్రౌండ్ కమ్యూనికేషన్స్, కో ఆర్డినేషన్..వందశాతం పక్కాగా అమలు చేశామని వుయి సో వ్యాఖ్యానించాడు. తమ తదుపరి రౌండ్లో ఇదే వ్యూహాన్ని అమలు చేస్తామని పేర్కొన్నాడు. ఇండోనేషియా జంటపై విజయం సాధించడం తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని చెప్పాడు. ఇండోనేషియా పెయిర్ ఓటమి పాలు కావడం వల్ల స్వర్ణ పతకంపై ఇక మిగిలిన దేశాలు కన్నేసినట్టే. ప్రధాన అడ్డంకి తొలగిపోవడం వల్ల మిగిలిన జట్లు తమ వ్యూహాలను మార్చుకునే పనిలో పడ్డాయి.